కొత్తచెరువులో కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభం
*ఆత్మహత్య చేసుకున్న శ్రీ సాకే రామకృష్ణ కుటుంబానికి రూ.లక్ష సాయం
అనంతపురం జిల్లా కొత్త చెరువులో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా ఇటీవల సాగు నష్టం, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు శ్రీ సాకే రామకృష్ణ గారి కుటుంబ సభ్యులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ఆయన భార్య శ్రీమతి సాకే సుజాతకు అందజేశారు. పార్టీ తరఫున అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు, శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు టి.సి. వరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామకృష్ణ చనిపోయిన తరువాత తమ కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోలేదని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని ఈ సందర్భంగా శ్రీమతి సుజాత పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు.