2020 ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో గెలవబోయేది ముంబై: గంభీర్

ఐపీఎల్‌ 2020 సీజన్‌ ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. గతేడాది రోహిత్ శర్మ నేతృత్వం వహించిన ముంబై ఇండియన్స్‌ ఫైనల్లో సీఎస్‌కేను 1 పరుగు తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ముంబైతో తొలిమ్యాచ్‌ ఆడనున్న సీఎస్‌కే ఎలాగైనా విజయం సాధించాలని ప్రతీకార వాంఛ తో  ఎదురు చూస్తుంది. దీనికి సంబందించి భారత మాజీ క్రికెటర్‌ గంభీర్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ షోలో మాట్లాడుతూ ఈ ఏడాది ఐపీఎల్‌ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కే గెలిచే అవకాశాలు ఉన్నాయని అన్నాడు.

“ఈసారి ముంబైలో ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాల బౌలింగ్‌ చూడడానికి నేను ఎదురుచూస్తున్నా. ఎందుకంటే వీరిద్దరూ ప్రపంచ స్థాయి బౌలర్లు. టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వాళ్లు.” అని గంభీర్ అన్నాడు. “చెన్నై సూపర్ కింగ్స్‌కు 3వ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికి సురేశ్‌ రైనా లేనందున ఇది చాలా పెద్ద సవాలుగా మారింది. షేన్ వాట్సన్ ఎక్కువ అంతర్జాతీయ క్రికెట్‌లు ఆడలేదు. ప్రాక్టీస్‌ కూడా ఈ మధ్యే మొదలు పెట్టాడు. అతను బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను ఎదుర్కోగలడా? ధోని బ్యాటింగ్‌ కూర్పు ఎలా ఉంటుందో చూడాలి.” అని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. “జట్టులో సమతుల్యత, లోపాలు చూస్తే మొదటి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్ గెలుస్తుందని నేను భావిస్తున్నా. వారు ఈసారి ట్రెంట్‌ బౌల్ట్‌ను కూడా జట్టుతో చేర్చుకున్నారు. మంచి బ్యాటింగ్‌ లైనప్‌తో పాటు బౌలింగ్‌ కూడా బలంగా ఉంది.” అని గంభీర్ తెలిపారు.