కచ్చితంగా గెలిచి తీరాలి

• ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ అప్రమత్తంగా అడుగులు వేయాలి
• కక్ష సాధింపు… అరాచకాలను నమ్ముకున్న పార్టీతో పోరాడుతున్నాము
• ఏ విధమైన ఒత్తిళ్ళు వచ్చినా మరుక్షణమే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురండి
• పార్టీ అభ్యర్థులు, నాయకులతో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

2024 ఎన్నికలు ఆంధ్ర ప్రదేశ్ గతిని మారుస్తాయి… ఈ ఎన్నికల్లో మన కూటమి పోరాడుతున్నది అరాచకాన్ని, హింసను, కక్ష సాధింపునీ నమ్ముకున్న పార్టీతో అని మరచిపోవద్దు అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ అభ్యర్థులు, నాయకులతో తెలియచెప్పారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలి అని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు, కొందరు ముఖ్య నాయకులతో బుధవారం ఉదయం నుంచీ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖాముఖీ చర్చించారు. శ్రీ కందుల దుర్గేష్ (నిడదవోలు), శ్రీ పంతం నానాజీ (కాకినాడ రూరల్), శ్రీ బత్తుల బలరామకృష్ణ (రాజానగరం), శ్రీమతి లోకం మాధవి (నెల్లిమర్ల)లతోపాటు శ్రీ పులపర్తి రామాంజనేయులు, శ్రీ బొమ్మిడి నాయకర్, శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, శ్రీ పత్సమట్ల ధర్మరాజు, శ్రీ దేవ వరప్రసాద్, శ్రీ పంచకర్ల రమేష్ బాబు, శ్రీ వంశీకృష్ణ యాదవ్, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ ఆరణి శ్రీనివాసులుతో ఈ రోజు చర్చించారు. ఈ సందర్భంగా వారికి ఎన్నికల నియమావళి, నామినేషన్ దాఖలు నుంచి పోలింగ్ వరకూ ఉండే వివిధ దశలు, నియమ నిబంధనలు, పొందాల్సిన అనుమతులను తెలియచేసే పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియలో వ్యూహాత్మకంగా ముందుకువెళ్లాలని… టీడీపీ, బీజేపీ నాయకులు, శ్రేణులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ప్రతి దశలోనూ అభ్యర్థులు, నాయకులు, శ్రేణులు అప్రమత్తంగా అడుగులు వేయాలని సూచించారు. ఏ విధమైన ఒత్తిళ్ళు వచ్చినా తక్షణమే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని తెలిపారు.