తెలంగాణాకే నా ప్రాధాన్యత: గవర్నర్ తమిళి సై

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించినప్పటికీ తన ప్రాధాన్యత తెలంగాణాకేనని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళి సై సౌందర రాజన్‌ అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటానని ఆమె తెలిపారు. పుదుచ్చేరి రాజ్‌ నివాస్‌ నుండి శుక్రవారం గవర్నర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైదరాబాద్‌ రాజ్‌ భవన్‌లోని అధికారులతో మాట్లాడారు. ‘నేను పుదుచ్చేరిలో ఉన్నప్పటికీ తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాలపై దృష్టి సారిస్తారు…’ అని తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్‌ కార్యదర్శి కె.సురేంద్రమోహన్‌ (పుదుచ్చేరి నుంచి), సలహాదారులు, సంయుక్త కార్యదర్శులు, ఇతర అధికారులు హైదరాబాద్‌ నుంచి పాల్గొన్నారు.