జేఈఈ మెయిన్-2021 షెడ్యూల్‌ విడుదల

వచ్చే ఏడాది నిర్వహించబోయే జేఈఈ మెయిన్‌ పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈసారి నాలుగు సార్లు ఈ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌టీఏ మంగళవారం ఈ పరీక్షల తేదీలను విడుదల చేసింది. ఫిబ్రవరిలో జరగబోయే తొలి విడత పరీక్షకు నేటి నుంచే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. నేటి నుంచి జనవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. ఫీజు చెల్లింపునకు జనవరి 16వరకు తుదిగడువు ఇచ్చిన ఎన్టీఏ.. దరఖాస్తుల్లో మార్పులు, మార్పులు చేర్పులకు జనవరి 18 నుంచి 21 వరకు అవకాశం కల్పించింది.