రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ఆస్కారమే లేదు : మంత్రి జగదీశ్ రెడ్డి

దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రమే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు వందల ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి.. తెలంగాణలో విద్యుత్ కోతలకు ఆస్కారమే లేదని మంత్రి తేల్చిచెప్పారు. ఒక్క నిమిషం కూడా రాష్ట్రంలో పవర్ కట్ ఉండదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను హైదరాబాద్‌కు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మళ్ళీ హైదరాబాద్ నుండి ఇతర జిల్లాలకు సరఫరా చేసేలా విద్యుత్ వలయం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. హైడల్ పవర్ ఉత్పత్తి కూడా బాగుందన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరులో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ తెలంగాణకు పూర్తిస్థాయిలో సరిపోతుంది అని మంత్రి స్పష్టం చేశారు. గత ఏడాది 16 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరం ఉంటే అంతే మొత్తంలో సరఫరా చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాబోయే రోజుల్లో తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో కూడా విద్యుత్ కోతలు వచ్చే అవకాశం ఉంది. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చట్టాల వలన రాష్ట్రంలో విద్యుత్ కోతలు వస్తాయి కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో ఎక్కడ కూడా కోతలు లేవు. ప్రైవేట్ కంపెనీలకు విద్యుత్ సంస్థలను ధారాదత్తం చేసేందుకే ఈ బొగ్గు కృత్రిమ కొరత అని నిపుణులు అంటుంటే నిజమే అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోనే ఇవాళ దేశంలో విద్యుత్ కోతలు సంభవించాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాయొద్దు అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.