‘టీకా ఉత్సవ్‌’లో రోజుకు 6 లక్షల మందికి టీకా: సిఎం జగన్‌

అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్‌ నిర్వహించాలని, ఆ సమయంలో రోజుకు కనీసం 6 లక్ష మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా చూడాలని సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ నాలుగు రోజులు కనీసంగా 24 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. అవసరమైన వ్యాక్సిన్‌ డోసులు కేంద్రాన్ని కోరాలని, అందుకోసం కేంద్రంలోని అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు ముగిసినందున వ్యాక్సిన్‌పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని, అందు కోసం అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులకు స్పష్టం చేశారు. టీకా ఉత్సవ్‌ విజయవంతం చేశాక మరిన్ని డోసులు తెప్పించుకోవడంపైనా దృష్టిపెట్టాలన్నారు.