జనసేన పక్షాన అన్ని గ్రామాల్లో ‘జాతీయ రైతు దినోత్సవం’ జరుపుకొందాం
డిసెంబర్ 23న ‘జాతీయ రైతు దినోత్సవం’ను పురస్కరించుకొని జనసేన పార్టీ పక్షాన ‘జాతీయ రైతు దినోత్సవం’ వేడుకగా జరుపుకుందాం అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతాంగం పట్ల ఉన్న మక్కువతో “కౌలు రైతు భరోసా” కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న 3 వేల మందికి పైగా రైతు కుటుంబాలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సహాయం అందజేసి, వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారు. ‘జాతీయ రైతు దినోత్సవం’ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని అన్ని గ్రామాల్లో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు సమష్టిగా ఏర్పడి స్థానిక రైతులతో సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు రైతాంగం కోసం పరితపిస్తున్న విధానాన్ని వివరించాలి. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే విధానాలను గురించి అందరికీ తెలియజేసి, రైతు సంక్షేమం కోసం జనసేన పని చేస్తుందనే భరోసా రైతులకు కల్పించాలని నాగబాబు కోరారు.