ఫార్మా ప్రమాద బాధితులకు పరిహారం చెల్లించాలి

  • పెందుర్తి జనసేన నాయకురాలు గొన్న రమాదేవి డిమాండ్

పెందుర్తి: ఫార్మసిటీలోని కోరి ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో రియాక్టర్ అమరుస్తుండగా జరిగిన ప్రమాదంలో మృతి చెందిన రాజారావు(38) కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం అందించాలని పెందుర్తి జనసేన నాయకురాలు గొన్న రమాదేవి డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంతో పరిశ్రమల్లోని కార్మికులతో పాటు ఫార్మా సమీప గ్రామాల్లోని ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు అన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఫార్మాసిటీలోని చాలా పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తున్న అనధికార కార్యకలాపాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆమె విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రతిసారి మరణించిన కుటుంబాలకు ఎంతో కొంత నష్టపరిహారం ఇచ్చి తరువాత ఆ పరిశ్రమలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఈ రకమైన ప్రమాదాలకు కారణం అవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.