వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని రక్షించడం ఎవరి తరం కాదు

* వైసీపీ పాలన ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉంది
* అక్కచెల్లెమ్మల పసుపుకుంకుమలు తుడిచేస్తున్న అన్న
* సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి మద్యం ఆదాయాన్ని పెంచుకుంటున్నారు
* దర్జాగా మద్యం మాఫియా నడుస్తోంది
* కల్తీ మద్యం దెబ్బకు ఐదువేల మరణాలు
* గడపగడపలో సంపూర్ణ మద్య నిషేధం ఏమైందని ఆడపడుచులు నిలదీయాలి
* విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం
* ప్రపంచ బ్యాంకు అప్పుల కోసమే ..అందులోభాగమే స్కూల్స్ మూత, ఉపాధ్యాయుల తొలగింపు
* క్షత్రియ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం అవమానించింది
* భీమవరంలో జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్

‘అన్న వస్తున్నాడు… అక్కచెల్లెమ్మల బతుకుల్లో వెలుగులు నింపుతాడు.. పూర్తిగా మద్యనిషేధం చేస్తాడని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి వైసీపీ నాయకత్వం మహిళల్ని మోసం చేసింద’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. మద్యం రక్కసి రాష్ట్రం నుంచి దూరంగా పారిపోతుందని ఆశతో అన్నకు నమ్మకంగా ఓట్లు వేశారు… అన్న వచ్చాడు. ఏమైంది.. మద్యనిషేధం చేస్తానని చెప్పిన అన్నే కల్తీ మద్యం అమ్ముతున్నాడన్నారు.. ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచి మరీ మద్యం సరఫరా చేయడమే అన్న చేసిన ఘన కార్యమని చెప్పారు. మద్యం, ఇసుక.. అన్నిట్లో దోచేస్తూ ప్రశ్నించిన వాళ్ళను వేధించి కేసులు పెడుతున్నారు అన్నారు. ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ రక్షించలేరు అన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జనవాణి, జనసేన భరోసా కార్యక్రమం ఆదివారం భీమవరంలో నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించిన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ” రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి గత మూడేళ్లలో సుమారు 5000 మంది వరకు మృతి చెంది ఉంటారని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రతిరోజు రాష్ట్రంలో ఎక్కడో దగ్గర కల్తీ మద్యం బారిన పడి ఎందరో మృత్యువాత పడుతున్నారు. ఇంటికి అండగా నిలవాల్సిన కుటుంబ పెద్ద కల్తీ మద్యం బారినపడి మృత్యువాత పడుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డు మీదకొస్తున్నాయి. అక్కా చెల్లెమ్మల పసుపు, కుంకుమలు తుడిచి పెట్టేలా పాలన చేస్తున్న అన్న గురించి మీరే ఆలోచించాలి. నడుం బిగించాల్సింది మీరే. ఆడపడుచులు ముందుకు వచ్చి ఈ ప్రభుత్వ దాష్టికాల మీద కదం తొక్కితే తప్ప మార్పు రాదు. కొత్త మద్యం విధానం మరోసారి తీసుకొచ్చిన ప్రభుత్వం ఈసారి బార్ల విధానంలో సమూల మార్పులు చేసింది. అర్ధరాత్రి వరకు బార్లు తెరుచుకునేందుకు అనుమతులు ఇవ్వడమే కాకుండా, దిగువ స్థాయి వైసీపీ నేతలను ప్రోత్సహించేందుకు మార్పులు, చేర్పులు చేపట్టింది. మద్య నిషేధం పూర్తిగా అమలు పరుస్తామని చెప్పిన వ్యక్తి గత మూడేళ్లలో రూ. 25 వేల కోట్ల ఆదాయాన్ని మద్యం మీద అర్జించాడు. మరో రెండేళ్లలో రూ.30 వేల కోట్ల ఆదాయం రాబట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. రూ.100 ఉన్న క్వార్టర్ మద్యం ధరలు రెండింతలపైగా పెంచేశారు. డిజిటల్ చెల్లింపులు చేయాలని కేంద్రం ప్రోత్సహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విచిత్రంగా మద్యం మీద డిజిటల్ చెల్లింపులకు నో చెబుతోంది. అంటే మద్యం మీద వచ్చే ఆదాయం ఎవరి జేబులోకి వెళ్తుంది.. ఎటు వెళ్తుంది అన్న లెక్క ఉండకూడదు అనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులు వద్దని చెబుతోంది. దీని వెనుక భారీ కుంభకోణం ఉంది.
* ప్రతి లీటరు మద్యానికి రూ.5 కప్పం
మరోపక్క గ్రామాల్లో సైతం బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో 70 రకాల నకిలీ మద్యం బ్రాండ్లు ఉన్నట్లు అంచనా. ఆదాన్ డిస్టిలరీస్ పేరుతో కల్తీ మద్యం అమ్ముతున్న ప్రభుత్వం ఆ కంపెనీ ఎవరిదో బయట పెట్టాలి. మాకు వచ్చిన సమాచారం మేరకు వైసీపీ నేతల బినామీలు కొందరి పేర్లు బయటికి వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి లీటరు మద్యం అమ్మకాలపై రూ. 5 కప్పం హైదరాబాదులో కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కప్పం డబ్బులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? కప్పం తీసుకొని కల్తీ మద్యం తయారు చేస్తున్న కంపెనీలను నియంత్రించే బాధ్యత ప్రభుత్వానిది కాదా? అన్నీ తెలిసే నియంత్రించడం లేదంటే తప్పు ఎక్కడ జరుగుతుంది? అసలు ఇంతగా పేదల జీవితాలపై ఆటలాడుతున్న వ్యక్తిని ఆడపడుచులు ఎలా నమ్మారు? అన్నగా ఎందుకు భావించారు? అడ్డగోలుగా మద్యం అమ్ముతూ మన బతుకులను ప్రభుత్వమే చిధ్రం చేస్తోంది. ఈసారి ప్రతి ఇంటి నుంచి అమ్మ, అక్క, చెల్లెలు నడుం బిగించాల్సిన సమయం వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. అన్న పాలన ఎంత దారుణంగా ఉందో మీకే అర్థం అవుతుంది.
* రాష్ట్రంలో విద్యా రంగం దిగజారిపోతోంది
విద్యా రంగం మీద దాదాపు రూ.55 వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్న ప్రభుత్వం దాని లెక్కలు బయటకు తీయాలి. నాడు – నేడు, అమ్మ ఒడి అంటూ రకరకాల పేర్లు పెట్టి లెక్కలు చెప్పే ప్రభుత్వం విద్యార్థుల ఉత్తీర్ణతలో ఎందుకు వెనుక బడింది. వరల్డ్ విజన్ సంస్థ దేశంలో విద్యా రంగం అభివృద్ధి మీద కృషి చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పేరు ఎక్కడా లేదు. డిగ్రీ చదివి ఉద్యోగం తెచ్చుకోని యువత రాష్ట్రంలో ఎక్కువవుతున్నారు. గత మూడేళ్లలో 36 ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప ప్రభుత్వం ఇది. యువత నిరుద్యోగితలో రాజస్థాన్, బీహార్ సరసన ఆంధ్రప్రదేశ్ నిలిచిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యా రంగంలో జీవో నెంబర్ 117 తీసుకొచ్చి విద్యా వ్యవస్థను పూర్తిగా అయోమయంలో పడేసారు. విలీనాల పేరుతో పాఠశాలల విద్యార్థులకు యాతన మిగిల్చారు. స్కూల్ ఎడ్యుకేషన్ ఆరు రకాలుగా విభజిస్తూ తీసుకొచ్చిన జీవోలో పూర్తిగా విద్యావ్యవస్థను తికమక పరిచారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. అయితే ప్రస్తుతం విలీనాల పేరుతో విద్యారంగం అస్తవ్యస్తం కావడంతో ఇరుకు తరగతుల్లో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీచర్ల సంఖ్యను ఒక కుట్ర ప్రకారం… ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు నిబంధనల మేరకు “సాల్ట్” పాలసీని అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రపంచ బ్యాంకు చెప్పినట్లుగా టీచర్ల సంఖ్యను తగ్గించారు. మరోపక్క ఎయిడెడ్ స్కూల్స్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ పాలసీ కూడా సరిగా లేదు. ఆడపిల్లలకు కనీసం స్కూళ్లలో మరుగుదొడ్లు కూడా లేని పరిస్థితి ఉందంటే ఎటు వెళ్తున్నామో గుర్తించండి. అన్నొచ్చాడు.. మామయ్య వచ్చాడు అని మీరు పిలిపించుకోకండి. మేం మిమ్మల్ని ఆప్యాయంగా పిలిచిన రోజు అప్పుడు మీరు విజయం సాధించినట్లు లెక్క.
* చిత్తశుద్ధి ఉంటే భోపాల్ ను స్ఫూర్తిగా తీసుకోండి
జనవాణి కార్యక్రమంలో ఎన్నో సమస్యలు నా దృష్టికి వచ్చాయి. గతంలో నేను పరిశీలించిన భీమవరం డంపింగ్ యార్డు సమస్యతో పాటు వివిధ పట్టణాలు, గ్రామాల్లో డంపింగ్ యార్డుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. చెరువులు, కుంటలు ఇతర ప్రాంతాల్లో చెత్తను ఇష్టానుసారం డంపింగ్ చేయడంతో తాగునీరు కలుషితమవుతోంది. గోదావరి జిల్లాలో కూడా మూత్రపిండాల వ్యాధులు ఎక్కువవుతున్నాయి. డంపింగ్ యార్డ్ సమస్యను అత్యంత చాకచక్యంగా పరిష్కరించిన భోపాల్ నగరాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. మీలో చిత్తశుద్ధి ఉంటే ప్రతి జిల్లాలోనూ డంపింగ్ యార్డుల సమస్యలను తీర్చండి. తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీ కాలుష్యం మీద కూడా నా దృష్టికి సమస్యను తీసుకువచ్చారు. అవినీతి, దోపిడీ విషయాలతోపాటు వంతెనలు, రోడ్ల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ఆడపడుచుల స్వయం సహాయక సంఘాల సమస్యలు తెలుసుకున్నాను. రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించడానికి మీకు ఎందుకు మనసు రాదు. మీ జేబులో డబ్బులు రూపాయి తీయడానికి మీకు ఎలాగూ మనసు ఒప్పదు. కనీసం ప్రజాధనం నుంచి అయినా ఖర్చు పెట్టండి.
* యువతను గంజాయి మత్తులో ఉంచుతున్నారు
ఆంధ్రప్రదేశ్ దేనిలో మొదటి స్థానంలో ఉన్నా లేకున్నా గంజాయి సాగు, రవాణాలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. యువతలో చైతన్యం వస్తే తమకు ఎక్కడ ఇబ్బంది అవుతుంది అన్న భయంతో యువతరాన్ని గంజాయి మత్తులో ఉంచాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ వాడేం చేశాడు వీడేం చేశాడు అని లెక్కలు వేయకుండా.. మీ రాష్ట్రానికి మీరేం చేయదలుచుకున్నారో ముందు నిర్ణయించుకోండి. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ను రక్షించడం ఎవరి తరం కాదు. ఏమైనా అడిగితే బూతులతో మంత్రులు రెచ్చిపోతున్నారు. మేం కూడా లోకల్ మాస్. ఇక్కడ బడుల్లో చదువుకున్నవాళ్ళమే. మీరు బూతులు తిడితే అంతకన్నా దారుణంగా బదులు ఇవ్వగలం జాగ్రత్త.
* వైసీపీ దుర్మార్గాలను ప్రశ్నిద్దాం
నోరు ఎత్తితే కేసు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాన్ బెయిలబుల్ అరెస్టులు.. బలంగా మాట్లాడితే బూతులు… నిరసనకు దిగితే దాడులు.. ఇదేమిటని అడిగితే హత్యలు అన్నట్లు వైసీపీ అరాచక పాలన సాగుతోంది. ప్రస్తుత పాలన ఎమర్జెన్సీ కాలం నాటి పాలన కంటే దారుణంగా ఉంది. ఇంతటి నియంతృత్వం ఎక్కడ ఎప్పుడు చూడలేదు. దళితుల మీద సైతం ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టే స్థాయికి వ్యవస్థలను దిగజారుస్తున్నారు. రాజకీయంగా విభేదించే వారి సినిమాలను నియంత్రించేందుకు వ్యవస్థలు పనిచేస్తాయి తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో వ్యవస్థలు పనిచేయకుండా చేశారు. తప్పు మనలో ఉంది. కళ్ల ఎదుటే ఇంత జరుగుతున్నా గొంతెత్తకుండా ఉంటే కచ్చితంగా మనకు మనమే ద్రోహం చేసుకున్నట్లు. ప్రతిదానికి భయపడి కూర్చుంటే పనులు జరగవు. ఎంతో కొంత వ్యక్తిగతంగా నష్టపోయినా, ఈ దుర్మార్గాలను గట్టిగా ప్రశ్నిద్దాం బలంగా పోరాడుదాం.
* ఒక వ్యక్తి పల్లకి మోయడానికి సొంత కులాలను తిడుతున్నారు
నేను కులాల ఐక్యత మీద బలంగా మాట్లాడే వ్యక్తిని. మన రాష్ట్రంలో ఆంధ్ర భావన పూర్తిగా పోతే, బలంగా ఉండే కుల భావన కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తమ సొంత కులాన్ని తిడుతూ, వేరే వ్యక్తి ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. ఒక్కడి కోసం తమ సొంత కులాలను కూడా తిడుతున్నారు. బీసీలకు అది చేసాం.. ఇది చేసామని చెబుతున్న వైసీపీ నాయకత్వం.. తెలంగాణలో గుర్తింపునకు నోచుకోని 18 బీసీ కులాల పరిస్థితి మీద ఎందుకు మాట్లాడరు. పక్కనే ఉన్న రాష్ట్రం ముఖ్యమంత్రితో ఇలాంటి విషయాలు ఎందుకు మాట్లాడరు.? మాట వినని దళిత నేతలను వేధిస్తున్నారు. ఎందుకు పనికిరాని నిధులు లేని బీసీ కార్పొరేషన్లు పెట్టి ఊదరగొడుతున్నారు. పోనీ సొంత సామాజిక వర్గమైన వారిని ఐనా వదులుతున్నారా అంటే అదీ లేదు. జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మా పార్టీ నేత మధుసూదన్ రెడ్డి వంటి వారిని కూడా వేధింపులకు గురి చేయడం వీరికి అలవాటయింది. నాయకుడు అంటే అన్ని కులాలను కలుపుకొని వెళ్లేవాడు. కొన్ని కులాలను వర్గ శత్రువులుగా ప్రకటించేవాడు కాదు. ఈయన చేసిన పనులకు సోషల్ మీడియాలో ఆయన కులాన్ని కొందరు తిడుతున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గంలో ఎందరో మహానుభావులు, అద్భుతమైన వ్యక్తులు మనకు కనిపిస్తారు.
* శ్రీ రఘురామకృష్ణం రాజుకి జరిగిన అవమానం క్షత్రియ వర్గానికి జరిగిన అవమానమే
27 ఏళ్ల మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారి దాష్టికలు, దారుణాలపై బలంగా పోరాడారు. అప్పట్లో పేరు గురించో, చరిత్ర గురించో ఆలోచించి ఆయన పోరాటం చేయలేదు. అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహ నిర్మాణానికి ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఎందుకు ముందుకు రావాలి..? ఇంతటి గొప్ప స్ఫూర్తిప్రదాత విగ్రహం ప్రభుత్వమే పెట్టొచ్చు కదా..! జనసేన ప్రభుత్వం వస్తే కచ్చితంగా జాతీయ నాయకుల విగ్రహాలను భావితరాలకు స్ఫూర్తివంతంగా ఉండేలా పెడతాం. అల్లూరి లాంటి విశ్వనరుడు జనసేనకు స్ఫూర్తి ప్రదాత. భీమవరంలో అల్లూరి విగ్రహ ఆవిష్కరణకు స్థానిక నియోజకవర్గ ఎంపీని సైతం రాకుండా వైసీపీ అడ్డుకునే పరిస్థితిలో నేను రావడం సరికాదు అనే భావనలో రాలేదు. రఘురామకృష్ణంరాజు మాపై గత ఎన్నికల్లో పోటీ చేశారు. మాకు ఆయనకు ఎలాంటి బంధుత్వం లేకపోయినా, ఒక పార్లమెంటు సభ్యుడుకి జరిగిన అవమానాన్ని సాటి మనిషిగా అర్థం చేసుకొన్నాను. ఆయనకి జరిగిన అవమానం క్షత్రియ సమాజానికి జరిగిన అవమానమే.
* అన్న భ్రమ నుంచి బయటకు రండి
వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బలంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. జనసేన పుట్టినప్పటి నుంచి జన క్షేత్రంలోనే తిరుగుతున్నాం. గత ఎన్నికల్లో అన్నను నమ్మారు… అదో భ్రమ అని తేలింది. రోడ్లమీద తిరిగిన వ్యక్తి ఎంతో మంచి చేస్తాడని అనుకున్నారు. రాగానే 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాలను రోడ్డున పడేశాడు. సహజ సంపదలను దోచుకునే మార్గాలను ఎంచుకున్నాడు. ఒక్కసారి రాష్ట్రంలోని ప్రజలంతా ఆలోచించాలి. అన్న వస్తే అద్భుతాలు జరుగుతాయని భావించిన వారు సైతం కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చింది. కచ్చితంగా మేము ప్రజా పోరాటాలు చేస్తాం. ప్రజలకు అద్భుత పరిపాలన అందించగల పటిష్టమైన ప్రణాళిక జనసేన వద్ద ఉంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.