రాజోలు నియోజక వర్గం చేరుకున్న వారాహి విజయ యాత్ర

• అడుగడుగునా శ్రీ పవన్ కళ్యాణ్ కి జన నీరాజనం
ప్రతి అడుగులో జనం నీరాజనాలు పలుకగా వారాహి విజయ యాత్ర రాజోలు నియోజకవర్గంలో ప్రవేశించింది. శుక్రవారం సాయంత్రం శ్రీ పవన్ కళ్యాణ్ అమలాపురం నుంచి పి.గన్నవరం మీదుగా భారీ ర్యాలీగా బయలుదేరి రాజోలు చేరుకున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతూ ముందుకు సాగుతున్న జనసేనానికి దారి పొడుగునా.. గ్రామ గ్రామానా ప్రజలు హారతుల స్వాగతం పలికారు. తాటిపాక వద్ద జేజేలు పలుకుతూ భారీ సంఖ్యలో కార్యకర్తలు రాజోలు నియోజకవర్గంలోకి ఆహ్వానం పలికారు. శ్రీ పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా రాజోలు పట్టణం జనసంద్రమైంది. జన సైనికులు, వీర మహిళల హర్షధ్వానాల మధ్య శ్రీ పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రాత్రి గం. 8.30 నిమిషాల సమయంలో దిండి రిసార్ట్ కు చేరుకున్నారు. అమలాపురం నుంచి దిండి వరకు జన సైనికులు వందలాది ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.