గురువులకు వందనం

“వందే గురుపరంపరాం”.. ఆది గురువైన అమ్మ నుంచి జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులందరికీ భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ భారతీయులందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. వేద జ్ఞానాన్ని మానవాళికి అందించిన వేద వ్యాసుడు మూల గురువుగా భావించి ఆయన జన్మించిన వ్యాసపూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకొనే ఈ వేడుకకు భారతీయ సమాజంలో విశిష్ట స్థానం ఉందన్న సంగతి సర్వవిదితమే! ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల తరువాత విశిష్ట స్థానాన్ని అందుకునేవారు గురువులే. గురుతహా సముపార్జించిన జ్ఞానం సుసంపన్నమైనది.. సుస్థిరమైనది. అందువల్లే మనం ‘గురు బ్రహ్మ’ అంటూ భగవంతునిగా గురువును ఆరాధిస్తాము. చాతుర్మాస్య దీక్ష ఆరంభ కాలమైన ఈ పౌర్ణమి నాడే సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి దక్షిణాయన పుణ్యకాలంలో తెలుగు వారంతా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో విలసిల్లాలని నా పక్షాన, జనసేన పక్షాన మనసారా కోరుకుంటున్నానని జనసేనాని పేర్కొన్నారు.