దొంగ ఓటు ప్రజా స్వామ్యానికి చేటు
- ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు
- ఎన్నికల సంఘం ఆదేశించినా ఫలితం శూన్యం
- దొంగ ఓట్లు తొలగించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం
- ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
చిత్తూరు: దొంగ ఓట్లను తొలగించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. చనిపోయిన వారి ఓట్లను కూడా తొలగించకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం తిరుపతి జిల్లాలో 17,62,205 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అలాగే వివిధ ఫారాల కింద పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆ ముసాయిదా ప్రకారం బిఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహిస్తే అందులో 3.88 శాతం అంటే 63,308 మంది ఆబ్సెన్టీ (స్థానికంగా లేని) ఓటర్లు ఉన్నట్టు గుర్తించారన్నారు. వీరిలో ఒక్క తిరుపతి నియోజకవర్గంలోనే 38,396 మంది ఉన్నారన్నారు. ఈ ఓట్లను వినియోగుంచుకొని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో లబ్ది పొందేందుకు కుయుక్తులు పన్నుతోందన్నారు. ఇక తిరుపతి నియోజకవర్గంలో దాదాపు 5,987 మంది చనిపోయినా వారి ఓట్లను తొలగించలేదన్నారు. సాక్షాత్ ఎన్నికల సంఘమే దొంగ ఓట్లపై అధికారులను హెచ్చరించినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గతంలో ఓ అధికారి లాగిన్ తోనే దొంగ ఓట్లు నమోదు చేసినట్టు ఇసి గుర్తించిన విషయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. వచ్చే ఓటర్ల జాబితాలో అనర్హులను తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే అందోళనను ఉధృతం చేస్తామన్నారు. అధికార వైసిపి ఎన్ని కుయుక్తులు పన్నినా అధికారంలోకి రాబోయేది జనసేన, టిడిపి ఉమ్మడి ప్రభుత్వమేనని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.