బీసీ కార్పొరేషన్లకు పదవుల ప్రకటన!

ఆంధ్రప్రదేశ్‌లో పదవులన్నీ ఒకే కులానికి కట్ట బెడుతున్నారని వస్తున్న విమర్శల నేపధ్యంలో వాటన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం భారీ ప్రయత్నం చేస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ప్రతీ కులానికి ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తోంది. వాటంతటికి పదవుల పంపకం చేయబోతోంది. కార్పొరేషన్ల పదవులను ఖరారు చేసే బాధ్యతను పార్టీ సీనియర్‌ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలకు అప్పగించారు.

వీరంతా పలు అంశాలపై కసరత్తు చేసి పేర్లను ఖరారు చేశారు. సాధ్యమైనన్ని బీసీ కులాలకు పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలుస్తోంది. బీసీల ఆర్థిక, సామాజిక ప్రగతి కోసం ఏర్పాటైన 56 కార్పొరేషన్లలో చైర్మన్‌ పదవులు 29 మహిళలకు, 27 పురుషులకు దక్కే అవకాశం ఉంది. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కనుంది.

వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ కులాలకు కూడా కార్పొరేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు. డైరెక్టర్‌ పదవుల్లో 50 శాతం మహిళలను నామినేట్‌ చేయనున్నారు. ప్రతి జిల్లాకు కనీసం 4 కార్పొరేషన్లకు తగ్గకుండా పదవులు కేటాయించారు. కొన్ని జిల్లాలకు 5, 6 పదవులను ఇస్తున్నట్టు తెలుస్తోంది .