జూపార్కులో జంతువులకు ఎయిర్ కూలర్లు!

తెలంగాణలో ఎండలు మండిపోతుండడంతో హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్కు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చిలోనే వేసవి తాపం అధికంగా ఉండడంతో జంతువులకు ఉపశమనం కలిగించేందుకు జూపార్కులో ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశారు. జూలో ఉన్న పలు ఎన్ క్లోజర్ల వద్ద కూలర్లు, కూలర్ ఫాగ్ మెషీన్లు, వాటర్ స్ప్రింక్లర్లు బిగించారు. దాంతో జూలో వాతావరణం చల్లగా మారడంతో అటు జంతువులే కాదు, సందర్శకులు కూడా హాయిగా ఫీలవుతున్నారు.

చింపాంజీలు, పెద్ద పులులు, సరీసృపాలు, ముళ్లపందులు, గుడ్లగూబలు ఉండే ఎన్ క్లోజర్ల వద్ద కూలర్లు ఏర్పాటు చేయడమే కాకుండా పైకప్పులను తుంగ, గోనెసంచులతో కప్పి వాటిని నీటితో తడుపుతున్నారు. అన్ని వేళలా జంతువులకు నీటిని అందుబాటులో ఉంచుతూ వాటిని వడదెబ్బ నుంచి కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.