ఫ్రాన్స్ లో కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ పర్యటన

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా కేటీఆర్ తన బృందంతో ఫ్రాన్స్ వెళ్లడం తెలిసిందే. ఈ క్రమంలో ఎంబీడీఏ మిస్సైల్ సిస్టమ్స్ సంస్థ డైరెక్టర్లతో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. రాష్ట్రంలో ఉత్పాదక రంగానికి ఉన్న అనుకూలతలను వారికి విడమర్చారు.

అనంతరం ఫ్రాన్స్ లోని అతిపెద్ద కాస్మొటిక్ క్లస్టర్ డిప్యూటీ సీఈవో ఫ్రాంకీ బెచెర్యూతో చర్చలు జరిపారు. భారత్ లో కాస్మొటిక్స్ కున్న డిమాండ్ ను, తెలంగాణలో కాస్మొటిక్స్ పరిశ్రమల స్థాపనపై తమ ఆలోచనలు పంచుకున్నారు. ఇక ఫ్రాన్స్ లో భారత్ రాయబారి జావేద్ అష్రఫ్ ను కూడా ఈ పర్యటనలో కేటీఆర్ కలిశారు. పెట్టుబడుల కోసం తాము చేస్తున్న ప్రయత్నాలను ఆయనకు వెల్లడించారు.