నేడు ఏపీ క్యాబినేట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలపై చర్చించే అవకాశం..

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక ఎజెండాలపై చర్చించనున్నారు.
ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మకాలకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేస్తుండడం తెలిసిందే. ఈ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌, ఈ సమావేశంలో మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. దీంతోపాటు టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం కోసం కూడా చట్ట సవరణ చేయనున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణకు ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కూడా ఈ భేటీలో ఆమోదముద్ర వేయనున్నారు. దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజు అంశం చట్ట సవరణ, దేవాదాయశాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వచ్చే నెల 15, 16 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపై కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.

అంతేకాకుండా.. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇంకా రాష్ట్రంలో గుట్కా నిషేదానికి చట్ట సవరణపై చర్చించే అవకాశముంది. అగ్రవర్ణాల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటుపై కూడా చర్చించే అవకాశముంది. మ్మ ఒడి పథకం అమలుపై కూడా సీఎం చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంటారని అధికారవర్గాలు పేర్కొన్నాయి.