ఈటలకు కార్యకర్తల భరోసా

హుజూరాబాద్‌: తనకు జరిగిన అన్యాయం భరించరానిదని కార్యకర్తలు అభిప్రాయపడ్డారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. హుజూరాబాద్‌లోని తన నివాసంలో శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, నేతలతో చర్చించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నానని చెప్పారు. ఉద్యమానికి ఊపిరినిచ్చిన ప్రాంతం హుజూరాబాద్‌ అన్నారు. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల ఉద్యమకారులంతా సూచనలు ఇచ్చారన్నారు. 20 ఏళ్ల ఉద్యమ ఘట్టాలను కొందరు గుర్తు చేశారని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటే ఉంటామని కార్యకర్తలు భరోసా ఇచ్చారని ఈటల తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ నుంచే కాకుండా ఖమ్మం సహా 9 జిల్లాల నుంచీ కార్యకర్తలు పరామర్శించేందుకు వచ్చారన్నారు. హైదరాబాద్‌ వెళ్లి అక్కడి శ్రేయోభిలాషులతోనూ చర్చించాల్సి ఉందని ఆయన తెలిపారు.