లింగపాలెం కౌలు రైతు భుక్యా వెంకటేశ్వరరావు కుటుంబానికి భరోసా

పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెంకు చెందిన కౌలు రైతు భుక్యా వెంకటేశ్వరరావు అప్పుల పాలై ఆరు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. అతనికి వయసు మళ్లిన తల్లిదండ్రులు ఉన్నారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా శనివారం లింగపాలెంకు వచ్చిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయం చెక్ రూపంలో అందచేశారు. తమ కుమారుడు చనిపోయి ఆరు నెలలు గడచినా ప్రభుత్వం తరఫు నుంచి పలుకరించే దిక్కు లేదని ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు తల్లి శ్రీమతి మారెసు పవన్ కళ్యాణ్ వద్ద వాపోయారు. వాలంటీర్ మినహా ఎవ్వరూ ఫోన్ చేయలేదనీ, అదీ మీరు వస్తున్నారని తెలిసిన తర్వాతే ఫోన్ వచ్చిందని తెలిపారు. కౌలు చేసి అప్పులపాలై తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్న నాటి నుంచి అధికారులు ఎవ్వరూ తమ ఇంటికి రాలేదని చెప్పారు. వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు గల కారణాలు అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా పార్టీ తరఫున కృషి చేస్తామని హామీ ఇచ్చారు.