బాక్సింగ్ డే టెస్ట్: భారత్ ఘన విజయం..

మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా మరోసారి విఫలమైంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల టార్గెట్‌ను భారత్ సునాయాసంగా చేధించింది. లక్ష్య చేధనలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(5), పుజారా(3) విఫలమైనా.. గిల్(35), రహనే(27) మరోసారి రాణించారు. దీనితో రెండో టెస్ట్ మ్యాచ్‌ను భారత్ నాలుగు రోజుల్లోనే ముగించింది. కాగా, ఈ ఫలితంతో నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. ఈ సిరీస్‌లో మిగిలివున్న మరో టెస్ట్‌లో ఎవరు ఆధిక్యం ప్రదర్శిస్తారో చూడాలి.

అడిలైడ్ టెస్ట్‌లో దారుణంగా ఓడిపోయిన భారత్ … ఈ విజయంతో అందుకు తగ్గ ప్రతీకారం తీర్చుకుంది. ముఖ్యంగా భారత బౌలర్స్ విజృంభించి ఆస్ట్రేలియాని రెండు ఇన్నింగ్స్‌లలో 200 పరుగుల లోపే కట్టడి చేశారు. బంతులను రాకెట్‌లా విసరుతూ బుమ్రా, సిరాజ్‌లు ఆస్ట్రేలియాని గజగజ వణికిస్తే అశ్విన్, జడేజాలు తన మణికట్టు మాయాజాలంతో కంగారూలను హడలెత్తించారు.

రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ, శుభ్‌మన్ గిల్‌, రహానే, జడేజాల అద్భుత పోరాట పటిమతో తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా సరిగ్గా 200 పరుగులకు కుప్పకూలింది. ఆతిథ్య జట్టులో గ్రీన్ 45, వేడ్ 40, లబుషేన్ 28, కమిన్స్ 22 కాసేపు ప్రతిఘటించడంతో భారత్ విజయం కాస్త లేట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ 3, బుమ్రా, జడేజా, అశ్విన్‌కు తలో 2 వికెట్లు, ఉమేష్ ఒక వికెట్‌ తమ ఖాతాల్లో వేసుకున్నారు.