మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ సదస్సుకు పిలుపు

మంత్రి కేటీఆర్ కు తాజాగా మరో అంతర్జాతీయ సదస్సుకు పిలుపు వచ్చింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సదస్సులకు హాజరైన కేటీఆర్.. మరో అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్నారు. ఇక ఏప్రిల్‌ 5 నుంచి 7 వరకు జపాన్‌ రాజధాని టోక్యోలో జరగనున్న ప్రపంచ సాంకేతిక పరిపాలన (గ్లోబర్‌ టెక్నాలజీ గవర్నెన్స్) సదస్సు – 2021కు హాజరుకావాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.

ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహిస్తున్న ఈ సదస్సుకు హాజరుకావాలని కోరుతూ ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బోర్గ్‌ బ్రండే కేటీఆర్‌కు మంగళవారం లేఖ రాశారు. ఈ లేఖలో బోర్గ్‌ పలు విషయాలను ప్రస్తావిస్తూ.. కరోనా సంక్షోభం అనంతరం ప్రపంచ దేశాలు తిరిగి అభివృద్ధి పథంలో నడిచేందుకు కొత్త టెక్నాలజీ వినియోగం, నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం, సాంకేతిక పరిమితులు, నూతన ఆవిష్కరణలు తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తామని బోర్గ్‌ తెలిపారు. ఇక తెలంగాణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ.. సామాజిక లబ్ధి కోసం వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారని బోర్గ్‌ ప్రశంసల వర్షం కురిపించారు.

ఇక ఈ సదస్సుకు ఆహ్వానం అందడం పట్ల స్పందించిన మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఇది తెలంగాణకు లభించిన మరో గుర్తింపు అని చెప్పుకొచ్చారు. ఈ సదస్సులో పాల్గొని నూతన టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ సాధించిన పురోగతిని ప్రపంచ దేశాలకు తెలియజేస్తామని చెప్పుకొచ్చారు.