వైయస్సార్ అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

వైయస్సార్ లైఫ్ లైమ్ అచీవ్ మెంట్ అవార్డులు, వైయస్సార్ అచీవ్ మెంట్ అవార్డులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన వారికి అవార్డులను అనౌన్స్ చేసింది. 31 మందిని లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులకు, 32 మందిని అచీవ్ మెంట్ అవార్డులకు ఎంపికచేశారు. వచ్చే నెల 14వ తేదీన అవార్డుల ప్రదాన కార్యక్రమం ఉంటుంది. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, వైయస్ కాంస్య ప్రతిమ, మెడల్, శాలువను అందజేయనున్నారు. అచీవ్ మెంట్ అవార్డు కింద రూ. 5 లక్షల నగదు, వైయస్ కాంస్య ప్రతిమ, మెడల్, శాలువ బహూకరించనున్నారు.

లైఫ్ టైమ్ అవార్డుకు ఎంపికైన వారిలో పలు సంస్థలు కూడా ఉన్నాయి. వీటిలో మత్స్యకార కుటుంబానికి చెందిన ఎంఎస్ఎన్ చారిటీస్ ట్రస్ట్ (కాకినాడ), సీపీ బ్రౌన్ లైబ్రరీ (కడప), సరస్వతి నికేతన్ లైబ్రరీ (వేటపాలెం), సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ (అనంతపురం జిల్లా), రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ (అనంతపురం), ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ (కడప), గౌతమి రీజనల్ లైబ్రరీ (రాజమండ్రి), మహారాజా గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ (విజయనగరం) ఉన్నాయి.