శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ డా. బీ.ఎస్. రావు మృతి బాధాకరం

విద్యారంగంలో లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ బి.ఎస్. రావు గారు కన్నుమూశారని తెలిసి బాధ కలిగిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు ఒక ప్రకటనలో తెలిపారు. బొప్పన సత్యనారాయణరావు గారు ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఇంగ్లండ్, ఇరాన్‌ దేశాల్లో వైద్యసేవలందించిన అనంతరం తాను పుట్టిన తెలుగు నేలకు వచ్చి 1986లో శ్రీ చైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల స్థాపించిన ఆయన అంచలంచెలుగా తమ విద్యాసంస్థలను విస్తరించారు. విజయవాడ నుంచి మొదలైన శ్రీ చైతన్య విద్యాసంస్థల ప్రస్థానం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారత దేశ వ్యాప్తంగానూ విస్తరించింది. డా. బి.ఎస్.రావు గారి మృతికి జనసేన పార్టీ తరపున నివాళి అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని శ్రీ నాగబాబు పేర్కొన్నారు.