జీపీఎఫ్ డబ్బులు మాయం చేయడమంటే ఉద్యోగులను మోసగించడమే

•రూ.800 కోట్లు ఎటు మళ్లించారో సీఎం సమాధానం చెప్పాలి
వైసీపీ ప్రభుత్వ పెద్దలు సూట్ కేసు కంపెనీలు పెట్టి, దొంగ లెక్కలు రాసిన అనుభవంతో కాగ్ కళ్ళకు గంతలు కట్టేలా నివేదికలు ఇస్తున్నారు. పథకాల లబ్ధిదారుల లెక్కల్లోనూ మసిపూసి మారేడుకాయ చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ సొమ్ములను వారికి తెలియకుండా ప్రభుత్వమే మాయం చేయడం విస్మయం కలిగిస్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ఇప్పటి వరకూ వెలుగులోకి వచ్చిన లెక్కల ప్రకారం రూ.800 కోట్ల సొమ్మును ప్రభుత్వం మళ్లించింది. ఉద్యోగుల ఖాతాల్లో ఉన్న ఈ డబ్బులు వారికి తెలియకుండా తీసేసుకోవడం అంటే మోసం చేయడమే. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక పాలన ఆశ్చర్యం కలిగిస్తోంది. జీపీఎఫ్ ఖాతాలోని డబ్బులను డ్రా చేసుకొనే అధికారం కేవలం ఉద్యోగికి మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం ఆ నిధికి కేవలం కస్టోడియన్ మాత్రమే. కాపలాదారే దోపిడీకి పాల్పడితే ఎలా? వైద్య ఖర్చులకో, బిడ్డ పెళ్ళికో, చదువులకో పీఎఫ్ డబ్బుల కోసం దరఖాస్తు చేస్తే నెలల తరబడి అనుమతి ఇవ్వకుండా పెండింగ్లో ఉంచుతున్న వైసీపీ ప్రభుత్వం – ఆ ఉద్యోగుల సొమ్మును వారికి తెలియకుండానే తీసేసుకొంటోంది అంటే ఈ పాలకుల ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులకు కరవు భత్యం పీఎఫ్ ఖాతాలో వేసినట్లే వేసి వెనక్కి తీసుకోవడం ద్వారా మోసం చేయడమే. అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా నిలుపుదల చేస్తోంది. రూ.800 కోట్లను ఎటు మళ్లించారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.