ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ వేళల్లో మార్పులు..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే శుక్రవారం నుంచి మరో రెండు గంటలు సడలింపు ఇవ్వనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూను సడలించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే కర్ఫ్యూ సమయంలో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. కొత్త నిబంధనలు ఈ నెల 20వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.

మారిన బ్యాంకుల పనివేళలు

కర్ఫ్యూ సడలింపులతో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. నిన్నటి వరకు ఉదయం 9 నుంచి 12 వరకు బ్యాంకులు పనిచేశాయి.