హర్భజన్ సింగ్ లేకుండానే యూఏఈకి బయలుదేరిన చెన్నై టీమ్

సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2020 యూఏఈలో ప్రారంభం కానుంది. ఈ నేపద్యంలో అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు ఈ వారం యూఏఈకి బయలుదేరనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సైతం ప్రయాణానికి సిద్ధమైంది. అయితే సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ లేకుండానే చెన్నై టీమ్ దుబాయ్‌కి బయలుదేరనుంది. ఈ విషయాన్ని సీఎస్కే టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది.

ప్రస్తుతం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సీఎస్కే టీమ్ ప్రాక్టిస్ సెషన్ నిర్వహిస్తుండగా.. రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌తో పాటు భజ్జీ సైతం గైర్హాజరు అయ్యాడు. తన తల్లికి అస్వస్థతగా ఉన్న కారణంగా ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాని హర్భజన్ సింగ్ యూఏఈ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. రెండు వారాల తర్వాత బయలుదేరనున్నాడని సమాచారం. జడేజా సైతం నేడు చెన్నైకి చేరుకుని జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది.