రైనా ఐపీఎల్‌కు దూరంకావడానికి కారణం

వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నానని సురేష్ రైనా ప్రకటించాడు. దీనికి కారణం రైనా మేనత్త అయిన ఆశాదేవి, ఆమె భర్త అశోక్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు ఈ నెల 19న తమ ఇంటి మేడ మీద నిద్రిస్తుండగా.. అర్ధరాత్రి దాటాక దోపిడీ కోసం వచ్చిన కొందరు దుండగులు వారిపై పాశవిక దాడి చేశారట. ఈ దాడిలో అశోక్ కుమార్ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. రైనా మేనత్తకు తీవ్ర గాయాలయ్యాయట. ఆమెను ఆసుపత్రిలో చేర్చగా ప్రాణాల కోసం పోరాడుతున్నట్లు తెలిసింది.

ఆమె పరిస్థితి విషమించడంతో రైనా స్వదేశానికి రాక తప్పని పరిస్థితి నెలకొంది. ఆమె అంటే అతడికి చాలా ఇష్టమట. ఆ దాడిలో అశోక్ కుమార్ తల్లి, ఇంకో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయట. అందరూ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ ఉదంతం రైనా కుటుంబంలో విషాదాన్ని నింపింది. దీంతో యూఏఈలో ఉండలేక, మేనత్తను చూసేందుకు రైనా స్వదేశానికి వచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఐపీఎల్‌కు దూరం కావాలని అతను నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.