రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ చేసిన ఆరోగ్య సిబ్బందికి సీఎం జగన్ అభినందనలు

ఏపీలో నిన్న ఒక్కరోజే 13 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు అందించడం జాతీయస్థాయి రికార్డు కావడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనతకు కారణమైన వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆయన అభినందించారు. నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కొవిడ్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ అంశాన్ని అధికారులు సీఎంకు వివరించారు.

వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటే వాటిని ప్రజలకు అందించే సమర్థత ఉందని నిరూపించారని సీఎం వైద్య ఆరోగ్య సిబ్బందికి కితాబునిచ్చారు. పక్కా ప్రణాళిక, సమర్థవంతమైన యంత్రాంగం వల్లనే ఇది సాధ్యమైందని కొనియాడారు. ఇక, రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల నిర్మాణంపైనా ఆయన ఈ సమీక్షలో చర్చించారు. నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం వేగంగా సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర కొవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.