ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్‌

మూడురోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ నిన్న ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రంలో చాలారోజులుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంకోసం ఆయన సంబంధిత శాఖల మంత్రులను కలుస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రధాని మోదీతోపాటు పలువురు మంత్రులను కలిసే అవకాశం ఉన్నది. విభజన హామీలతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రధానితో చర్చించనున్నారు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురిని కలువనున్నారు. జాతీయ రహదారులకు నిధుల మంజూరుపై గడ్కరీతో, సిద్దిపేటలో విమానాశ్రయం ఏర్పాటుపై హర్‌దీప్‌సింగ్‌తో చర్చించే అవకాశం ఉన్నది. నిన్న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యారు. నీటి ప్రాజెక్టులు, నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.