కమిషన్లు దండుకుంటున్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు

ఏలూరు: ప్రైవేటు ల్యాబ్ ల యాజమాన్యంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కుమ్మక్కై భారీ మొత్తంలో కమిషన్లు దండుకుంటున్నారని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఏలూరు నగర ప్రజలే కాకుండా జిల్లాలోని 40 గ్రామాల నుంచి ప్రతీ రోజూ వైద్య సేవలు కోసం రోగులు వస్తుంటారన్నారు. రోగికి వ్యాధి నిర్ధారించే పరీక్షలను ఆసుపత్రిలో ఏళ్ల తరబడి ఉచితంగానే చేస్తున్నారని తెలిపారు. అయితే గత కొంతకాలం నుండి అవుట్ పేషెంట్లకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండా ప్రైవేటు ల్యాబ్ లకు రిఫర్ చేస్తున్నారని, ఒక్క ఎమ్మారై స్కానింగ్ కు 5 వేల రూపాయలు వసూలు చేస్తూ 1500 రూపాయల కమిషన్ను రిఫర్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లకు ముట్ట చెబుతున్నారని తెలిపారు. ఇలా ప్రతిరోజు లక్షల రూపాయలు పేద రోగుల నుంచి కమిషన్ ద్వారా దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్ అయిన ఏలూరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసినప్పటికీ కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా ఉందన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తో సహా పలువురు డాక్టర్లు కమీషన్లకు ప్రాధాన్యత ఇస్తూ అవుట్ పేషెంట్లను ప్రైవేట్ ల్యాబ్ లకు పపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి రోగానికి కూడా ఆసుపత్రిలో వైద్యసేవలు అందించకుండా విజయవాడ లేదా గుంటూరుకు రిఫర్ చేయడం వల్ల ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారని, అప్పుల పాలవుతున్నారని తెలిపారు. ఆసుపత్రిలో జరుగుతున్న లాబీయింగ్ పై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు దృష్టి పెట్టి ఆసుపత్రికి వచ్చే ప్రతీ రోగికి రోగ నిర్ధారణ పరీక్షలు ఉచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులందరూ పేద మధ్య తరగతి ప్రజలేనని, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ అనే తేడా లేకుండా వ్యాధి నిర్ధారణకు సంబంధించిన అన్ని వైద్య పరీక్షలను ఉచితంగా చేయాలన్పారు. లేకుంటే ఆసుపత్రి వద్ద ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా,‌ నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శులు బొత్స మధు, కందుకూరి ఈశ్వరరావు, 2టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల ఉమాదుర్గ, మండల అధ్యక్షులు వీరంకి పండు, సోషల్ మీడియా కన్వీనర్ జనసేన రవి, నాయకులు నూకల సాయి ప్రసాద్, బుద్ధ నాగేశ్వరావు, బెజవాడ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.