నూతన దశలోకి అడుగు పెట్టిన కరోనా: డబ్ల్యూహెచ్ఓ

ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌కు సంబంధించి కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారిలో యువత ఎక్కువగా ఉన్నారని స్పష్టం చేసిoది. వీరి వల్ల అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వృద్ధులకు కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. టిఒఐ కథనం మేరకు..20లు, 30లు, 40 ఏళ్ల వయసులో ఉన్న వారికి కరోనా సోకినా వారికి ఆ విషయం తెలియడం లేదు. కానీ వీరి వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ‘కరోనా మహమ్మారి మార్పు చెందుతోంది. 20లు, 30, 40లలో ఉన్నవారి కారణంగా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ వయస్కుల్లో చాలా మందికి తాము కోవిడ్ బారిన పడిన విషయం తెలియడం లేదు’ అని డబ్ల్యూహెచ్‌వో వెస్ట్రన్ పసిఫిక్ రీజినల్ డైరెక్టర్ తకేషి కసయ్ తెలిపారు. ఫలితంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా జరగడం అంటే కేవలం కరోనా కేసులు పెరగడమే కాదు ఆసియా పసిఫిక్ రీజియన్‌లో మహమ్మారి నూతన దశలోకి మనం అడుగుపెట్టాం అని కసయ్ వ్యాఖ్యానించడం గమనార్హం. మ్యూటేషన్లను పరిశీలిస్తే వైరస్ ఇప్పటికీ స్టేబుల్‌గానే ఉందని కసయ్ తెలిపారు. వ్యాక్సిన్ తయారు చేసే సమయంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన తగిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.