అవినీతిని నిర్మూలించాలి: జగన్

అవినీతి నిర్మూలనపై సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అవినీతి రహిత రాష్ట్రాన్ని రూపొందించాలంటూ అధికారులకు ఆదేశించారు. క్షేత్రస్థాయి నుంచి కార్యాచరణ మొదలవ్వాలని స్పష్టం చేశారు. 1902 నెంబర్ ను ఏసీబీకి, జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు అనుసంధానం చేయాలని, అవినీతిపై గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించాలని అన్నారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి ఉండకూడదని, అవినీతిని కూకటివేళ్లతో నిర్మూలించాలని పిలుపునిచ్చారు.

ఫిర్యాదులను పరిశీలించి, వాటి పరిష్కారాలను మానిటరింగ్ చేసే వ్యవస్థ బలంగా ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. 1440 నెంబర్ పై మరింత ప్రచారం నిర్వహించాలని, అవినీతి వ్యవహారాలతో పక్కా ఆధారాలతో దొరికిపోతే వారిపై చర్యలు తీసుకోవడానికి ఎక్కువ కాలం పట్టకూడదని పేర్కొన్నారు. అవినీతిపరులకు నిర్దిష్ట కాలావధిలో శిక్ష పడేందుకు తగిన చట్టం తీసుకువస్తామని, అసెంబ్లీలో ఈ చట్టం తీసుకువచ్చేలా బిల్లును రూపొందించాలని సూచించారు.