దిశ ఎన్ కౌంటర్: సజ్జనార్ పై ప్రశ్నల వర్షం

దిశ ఎన్‌ కౌంటర్‌ లో భాగంగా ఇవాళ దిశ కమిషన్ ముందు సజ్జనార్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ పై ప్రశ్నల వర్షం కురిపించింది దిశ కమిషన్‌. మిమ్మల్ని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా మీడియా అభివర్ణించిందని.. మీరు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఒప్పుకుంటారా ? అని కమిషన్ ప్రశ్నించింది. తాను దీనికి అంగీకరించబోనని సజ్జనార్ బదులిచ్చారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఏమిటి ? అని కమిషన్ అడగగా… తనకు తెలియదన్నారు సజ్జనార్.

మీరు ప్రతీది డీసీపీ చెప్తేనే తెలిసింది అంటున్నారు.. డీసీపీ పై నే ఆధార పడతారా ? అని కమిషన్ ప్రశ్నించగా.. గ్రౌండ్ లెవెల్ లో ఆఫీసర్ లకు, పూర్తి సమాచారం ఉంటుంది..వారికి తాను ఫ్రీ హ్యాండ్ ఇస్తానని సమాధానం ఇచ్చారు సజ్జనార్. దిశ అత్యాచారం జరిగిన రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహించారని ప్రశ్నించింది కమిషన్. మిస్సింగ్ కంప్లైంట్ రాగానే బాధితురాలి కోసం వెతకడం లో కొంత సమయం డిలే అయ్యిందన్నారు సజ్జనార్. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా.. ఎఫ్ ఐ నమోదు చేయడంలో అలసత్వం వహించిన నలుగురు పోలీస్ సిబ్బంది పైన సస్పెన్షన్ విధించామని సజ్జనార్ బదులిచ్చారు.

ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో విచారణ ముగియకముందే మీడియా సమావేశం ఎలా పెట్టారని… మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వల్లే విచారణ సరిగా చేయలేకపోయాము అని సాక్షులు చెప్పారు ? కమిషన్ అడిగింది. ఎన్ కౌంటర్ స్పాట్ కి 300 మీటర్ల దూరంలో విచారణకు ఆటంకం కలగకుండా వీడియో సమావేశం ఏర్పాటు చేశామన్నారు సజ్జనార్. వీడియో సమావేశం కోసం కుర్చీలు, టెబుల్లు తదితర సామగ్రిని అంత తక్కువ సమయం లో ఎక్కడి నుండి తెచ్చారని ప్రశ్నించింది కమిషన్.
షాద్ నగర్ పోలీసులు సమగ్రి నీ తీసుకొచ్చారని… ఎక్కడి నుండి సామాగ్రి నీ తీసుకొచ్చారో తనకు తెలియదని సమాధానం ఇచ్చారు సజ్జనార్. ఆ ఘటన జరిగి రెండు సంవత్సరాలు అయ్యింది తనకేం గుర్తు లేదని చెప్పారు సజ్జనార్.