టీ20లో డబుల్ సెంచరీ.. రికార్డు సృష్టించిన ఢిల్లీ క్రికెటర్

టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ఢిల్లీకి చెందిన సుబోధ్ భాటి ఈ ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ నమోదు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఢిల్లీలో ఆదివారం జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో ఢిల్లీ ఎలెవన్ జట్టు తరపున బరిలోకి దిగిన భాటి చెలరేగిపోయాడు.

 సింబా జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో 79 బంతుల్లో అజేయంగా 205 పరుగులు చేశాడు. ఇందులో 17 ఫోర్లు, 17 సిక్సర్లు ఉన్నాయి. అతడి దెబ్బకు స్టేడియం హోరెత్తిపోయింది. అతడిని నిలువరించడం ప్రత్యర్థి బౌలర్లకు సాధ్యం కాలేదు. ఇక, తొలి వంద పరుగులను భాటి 17 బంతుల్లోనే సాధించడం గమనార్హం. అతడి బాదుడుతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 256 పరుగుల భారీ స్కోరు చేసింది.

కాగా, విండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ 2013 ఐపీఎల్‌లో పూణె వారియర్స్‌పై విధ్వంసం సృష్టించాడు. 66 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. అరోన్ ఫించ్ జింబాబ్వేపై 76 బంతుల్లో 176 పరుగులు సాధించాడు. ఇప్పుడు సుబోధ్ భాటి క్లబ్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ బాది రికార్డులకెక్కాడు.