మహిషాసురుడు లాంటి జగన్ ను కొట్టాలంటే అందరూ ఏకం కావాల్సిందే

* వైసీపీని గద్దె దించకపోతే భవిష్యత్తు అంధకారం
* అధికార పార్టీ నాయకులకు దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ.. అభివృద్ధిపై లేదు
* ఉత్తరాంధ్ర ప్రజల మంచితనాన్ని క్యాష్ చేసుకుంటున్నారు
* చోడవరం ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు

‘ఎంతమంది కలిసి వచ్చినా జగన్ సింగిల్ గానే వస్తాడు అని వైసీపీ వాళ్లు గొప్పగా చెప్పుకొంటున్నారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి అనేక మంది దేవతలు ఏకం కావాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రజలను పట్టిపీడిస్తున్న జగన్ అనే మహిషాసురుడుని గద్దె దించడానికి ఎన్ని పార్టీలు కలిసినా తప్పు లేద’ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు అన్నారు. వైసీపీలో ఉన్న క్రూరమైన, స్వార్థపరులైన నాయకులను నా జీవితంలో చూడలేదని చెప్పారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మా నియోజకవర్గంలో రోడ్లు లేవు.. ఉన్నవన్ని గుంతలే అని మాట్లాడాడు అంటే పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. శుక్రవారం సాయంత్రం చోడవరం నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ… “ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణం ఈ ప్రాంత నాయకులే. ఈ ప్రాంతంలో రెండు రకాల మనుషులు ఉంటారు. 99.99 శాతం మంచితనం కలిగిన అమాయకులు. 0.01 శాతం మహాముదుర్లు. ఈ రెండో రకం వాళ్లు నాయకులుగా చెలమణి అవుతూ 99.99 శాతం ప్రజలను దోచుకుంటున్నారు. వీళ్లకు కుటుంబ ఆస్తులను పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ… ఉత్తరాంధ్ర అభివృద్ధిపై లేదు.
• ప్రాణాలు పోతున్నా పట్టదా?
చోడవరం నియోజ‌క‌వ‌ర్గాన్ని అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలో రెండు రిజ‌ర్వాయ‌ర్లు ఉన్నాయి. కోనాం, కళ్యాణ లోవ రిజ‌ర్వాయ‌ర్లు ఉన్నా రైతుల సాగునీటికి ఎప్పుడు క‌ష్టాలే. కాలువలు అధ్వానంగా వుండడంతో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందక రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఆధునికీకరణ, మరమ్మతు పనుల కోసం ఏటా అధికారులు ప్రతిపాదనలు పంపించడం, ప్రభుత్వం మొండి చేయి చూపడం ఆనవాయితీగా మారింది. అలాగే పెద్దేరు వాగు మీద వంతెన కట్టకపోవడంతో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వరుసగా ప్రాణాలు పోతున్నా వైసీపీ నాయకుల్లో చలనం లేకపోవడం బాధాకరం. కోడి, మేక వంటి వాటి ప్రాణాలకు ఎలాంటి విలువ ఇస్తారో మనుషుల ప్రాణాలకు అలాంటి విలువే ఇస్తున్నారు వైసీపీ నాయకులు. చోడవరం సుగర్ ఫ్యాక్టరీపై 24వేల మంది రైతులు, 4 వేల మంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నారు. చెరకు పంటకు మద్దతు ధర పెంచాలని రైతులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. చోడవరం బస్టాండ్ అభివృద్ధి చేయాలని అడుగుతున్నారు. ఇవన్ని కూడా కొద్దిపాటి మనసు పెడితే పూర్తయ్యే పనులే. కానీ వైసీపీ నాయకులు పట్టించుకోలేదు. కనీసం ఈ ప్రాంతాల్లో మంచి ఆస్పత్రి కూడా లేకపోవడం దారుణం.
• వైసీపీ పాలనలో అభివృద్ధి పాతికేళ్లు వెనక్కి వెళ్లింది
రాష్ట్రంలో 900 కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం ఉంది. పదేళ్లలో యూరేపియన్ దేశాల్లా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మేధావులు చెబితే చాలా సంతోషించాను. కానీ వైసీపీ పాలన చూశాకా రాష్ట్ర అభివృద్ధి 25 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. పారిశ్రామికవేత్తలను కమీషన్ల కోసం బెదిరించడంతో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయి. పరిశ్రమలు రాకపోవడంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. వైసీపీ అధికారంలోకి వస్తే కొండలు, గుట్టలు మింగేస్తారని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలను నిజం చేస్తూ వైసీపీ పాలన సాగుతోంది. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఏ నియోజకవర్గం తీసుకున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. కనీస మౌలిక వసతులు లేవు. తాగు, సారునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. వైసీపీ నాయకులకు కోట్లు సంపాదించడంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు.
• శ్రీ పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు శతాబ్దానికి ఒకరు పుడతారు
రాష్ట్రాన్ని ఎంతో మంది నాయకులు పాలించారు. కొంతమంది మాత్రమే ప్రజల గుండెల్లో మిగిలిపోతారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు శతాబ్దానికి ఒకరు పుడతారు. సమకాలిక నాయకులు ప్రజలను ఎలా దోచుకోవాలని ఆలోచిస్తుంటే… పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ప్రజలకు తన కష్టార్జితాన్ని పంచుతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకున్నారు. రెండు రోజుల క్రితం కార్యకర్తల కోసం ఇన్సురెన్స్ కోసం రూ. 3.5 కోట్లు ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూపోతే తన కష్టార్జితాన్ని ప్రజల కోసం ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి నాయకులు ప్రపంచంలో ఎక్కడ ఉండరు. ఇలాంటి నాయకుడి నాయకత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన- టీడీపీ అలయన్స్ కు ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రజా పాలన ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ ఇంఛార్జి శ్రీ పీవీఎస్ఎన్ రాజు, ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి శ్రీ సుందరపు వెంకట సతీష్, విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి శ్రీ సుందరపు విజయ్ కుమార్, పార్టీ నేత శ్రీ వి.గంగులయ్యతో పాటు నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.