అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి 12 గంటల సమయంలో కొవిడ్‌ వార్డులో ఉన్న రికార్డు రూమ్‌లో మంటలు చెలరేగాయి. రికార్డు రూమ్‌ పక్కనే 24 మంది కొవిడ్‌ బాధితులు ఉన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.

అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్య, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, అనంతపురం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ప్రమాదస్థలానికి  చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే కొవిడ్‌ వార్డులోని బాధితులను మరో వార్డుకు తరలించామని అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్య, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, మంటలు వ్యాపించకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తెలిపారు.