నేడు అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారైతే రేపు ఢిల్లీకి జగన్!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కనుక నేడు ఖరారైతే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డి రేపు (సోమవారం) ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. షా అపాయింట్‌మెంట్‌ను బట్టి జగన్ పర్యటన ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. షాను కలిసిన అనంతరం ఇతర మంత్రులను కూడా జగన్ కలిసే అవకాశం ఉందని సమాచారం. అవసరమనుకుంటే రేపు రాత్రి ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది.

అమిత్‌ షాతో భేటీ సందర్భంగా పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లుల క్లియరెన్స్, కేంద్రం నుంచి కొవిడ్  సాయంతో పాటు మూడు రాజధానుల నిర్ణయం గురించి కేంద్రమంత్రికి జగన్ వివరించి సహకరించాల్సిందిగా కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని కోరతారని సమాచారం.