మత్స్యకారుల సంక్షేమం… ఉపాధి కల్పనపై చిత్తశుద్ధి ఏదీ?

కడలినీ, కాయ కష్టాన్నీ నమ్ముకొని ఆటుపోట్లతో జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడి సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ఆ దిశగా అడుగులు వేస్తాం. మెరైన్ ఫిషింగ్ కి తగ్గట్లు సుదీర్ఘ తీరం ఉన్న మన రాష్ట్రంలో, ఇన్ ల్యాండ్ ఫిషింగ్ కి అనువుగా ఎన్నో జల వనరులు ఉన్నాయి. కానీ మన మత్స్యకారులకు తగిన జీవనోపాధి లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు. మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కల్పనపై రాష్ట్ర పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. గుజరాత్, కేరళ తీరాల్లో ప్రతి 30 కి.మీ.లకు ఒక జెట్టీ ఉండటంతో మత్స్యకారుల ఉపాధికీ, వేటకీ సౌలభ్యం ఏర్పడింది. మన రాష్ట్రంలో మాత్రం జెట్టీలు నిర్మిస్తాం… హార్బర్లు కట్టేస్తాం అని మాటలు మాత్రమే ఈ ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమంత్రి అధికార నివాసానికి రూ.451 కోట్లు వెచ్చించేందుకు నిధులు విడుదల చేసే ప్రభుత్వం మత్స్యకారులకు జెట్టీలు, హార్బర్లు నిర్మాణానికి మాత్రం ఆసక్తి చూపటం లేదు. రుషికొండపై నిర్మితమవుతున్న రాజ మహల్ కోసం చేస్తున్న ఖర్చుతో ఒక హార్బర్ నిర్మించవచ్చు. ఏడు జెట్టీలు నిర్మాణం చేయవచ్చు. ఈ ప్రభుత్వానికి మత్స్యకారుల ఉపాధి, సంక్షేమం అనేవి ప్రాధాన్యం కాదు… రుషికొండ కొట్టేసి మహల్ నిర్మించుకోవడమే ముఖ్యం అని తేటతెల్లమవుతోంది. మత్స్యకారులకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలులో సైతం నిబంధనల పేరుతో కోతలు వేస్తున్నారు. వలలు, డీజిల్ రాయితీలపైనా శ్రద్ధ లేదు. ఉమ్మడి ప్రభుత్వంలో.. హామీలు, శంకుస్థాపనలతో సరిపుచ్చకుండా మత్స్యకారులకు ఉపాధి కల్పనపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తాం. మన మత్స్యకారులు గుజరాత్, కేరళ, మహారాష్ట్ర లాంటి చోట్లకు వలసలు వెళ్లాల్సిన అవసరం లేకుండా తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. తీర గ్రామాల్లో విద్య, వైద్య వసతుల మెరుగుదలపైన, మత్స్యకార కుటుంబాల్లోని మహిళలు, వృద్ధుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెడతాం అని జనసేనాని హామీ ఇచ్చారు.