ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు అడ్డుకొంటే కేసులు పెడతారా?

• వైసీపీ ఇసుక దోపిడీని కచ్చితంగా నిలువరిస్తాం
వైసీపీ ముఖ్య నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకూ ఇసుక దోపిడీ ప్రధాన ఆదాయ మార్గమైపోయింది. అడ్డగోలుగా ఇసుక, మట్టి తవ్వేస్తున్నా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. అక్రమ తవ్వకాలపై న్యాయ పోరాటం ద్వారానో, ప్రజా పోరాటం ద్వారానో అడ్డుకొంటున్న జనసేన నాయకులను తప్పుడు కేసులతో వేధిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విమర్శించారు. మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలోని తాతపూడి దగ్గర గోదావరి తీరంలో అక్రమంగా ఇసుక, మట్టి తవ్వుతుండటంతో ఆ నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ హైకోర్టులో పోరాడుతున్నారు. అక్కడి లంక భూముల్లో యధేచ్చగా ఇసుక, మట్టి తవ్వేస్తున్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో శ్రీ లీలాకృష్ణతోపాటు మరో ముగ్గురు జనసేన కార్యకర్తలపై కేసులు నమోదు చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దోపిడీని అడ్డుకొంటే కేసులు పెడతారా? అప్రజాస్వామికమైన ఈ అక్రమ కేసులపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం. ఓ వైపు రెవెన్యూ అధికారులు అక్కడ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయని చెబుతూనే ఉన్నారు. గోదావరి ప్రవాహాన్ని అడ్డుకొనేలా రోడ్డు వేసి మరీ తవ్వుతున్నారు అంటే దోపిడీ కోసం వైసీపీ నాయకులు ఏ స్థాయిలో బరి తెగిస్తున్నారో అర్థమవుతోంది. రాష్ట్రంలో సాగుతున్న ఇసుక, మట్టి దోపిడీని జనసేన పార్టీ కచ్చితంగా నిలువరిస్తుందని శ్రీ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.