గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం జనసేనతోనే సాధ్యం: కొండిశెట్టి ప్రవీణ్ కుమార్

శింగనమల, గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం జనసేనతోనే సాధ్యమని జనసేనపార్టీ శింగనమల నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం నార్పల మండల కేంద్రంలో జనసేనపార్టీ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 153వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వారు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన దేశం కోసం చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తెల్లదొరల నుండి మన జాతి బానిస సంకెళ్లను తెంపడానికి సత్యం, అహింస మార్గాలను ఎంచుకుని భారత స్వాతంత్ర్య ఉద్యమాలలో కీలకమైనటువంటి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణ వంటి అనేక ఉద్యమాలలో ప్రధాన భూమిక పోషించారని అన్నారు. నేటితరం యువత గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కలవాయి విశ్వనాథ్ రెడ్డి, ఆసాది పవన్ కళ్యాణ్, అన్సర్ బాషా, లోకేష్, నాగేష్, శివరాయల్, నాగేశ్వర్ రెడ్డి, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.