మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రాత్రి 10.45 వరకు మెట్రో పరుగులు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూన్ చెప్పింది. నగరంలో కరోనా కేసులు తగ్గి ప్రయాణికుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో వేళల్లో మెట్రో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. మెట్రో రైలు వేళలను రాత్రి పూట పొడిగించారు. అధికారులు మరో 45 నిమిషాలు పెంచారు. లాక్‌డౌన్‌ తర్వాత ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు రైళ్లు నడుస్తున్నాయి. శుక్రవారం నుంచి రాత్రి 9.45 గంటల వరకు సర్వీసులు నడుపనున్నారు. ప్రారంభ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 9 గంటలకు కాకుండా 9.45 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 10.45 గంటలకు గమ్య స్థానం చేరుతుంది. రాత్రి ఆలస్యంగా విధులు ముగించుకుని ఇంటికెళ్లేవారికి పెంచిన వేళలతో ప్రజా రవాణా అందుబాటులో ఉండనుంది.

శుక్రవారం నుంచి పెంచిన మెట్రో వేళలు అమల్లోకి వస్తాయని ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ కేవీబీరెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరారు. ప్రయాణికులందరి భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరు విధిగా మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించి సహకరించాలని ఆయన సూచించారు. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా మెట్రో అధికారులు ఈ మేరకు వేళలను పొడిగించారు.