కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: తగరపు శ్రీనివాస్

తెలంగాణ, భీమధేవరపల్లి మండలం, కొప్పూరు గ్రామానికి చెందిన దాట్ల ప్రవీణ్ ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాన్ని జనసేన పార్టీ నాయకులు పరామర్శించారు. దాట్ల ప్రవీణ్ తనకున్న 20 గుంటల భూమి, మరో 1.20 గుంటల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో తనకున్న భూమిలో వ్యవసాయ బావి తవ్వగా, నీళ్ళు పడకపోవడంతో వేరే బావి తవ్వించగా మళ్ళీ నీళ్ళు పడకపోవడంతో, అప్పుల బాధ భరించలేక, మనస్తాపానికి గురై తన పోలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు తమ సొంత భూమిలో నీటి కోసం తవ్వించే వ్యవసాయ బావిలకు, బోరులకు వంద శాతం సబ్సిడీ కల్పించి ఇలాంటి ఆత్మహత్యలను, ఆర్థిక సమస్యల నుండి రైతులను విముక్తి చేయాలని జనసేన పార్టీ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు నాయకులు పొడిశెట్టి విజయ్, కొలుగూరి అనిల్, మోరె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.