తెలంగాణ పోలీస్ నియామక పరీక్షలో తప్పులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నిర్వహించిన పోలీసు నియామక రాత పరీక్షలో నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కీ విడుదల చేసినప్పుడే అభ్యంతరాలు చెప్పినా ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని తెలంగాణ నుంచి కొందరు అభ్యర్థులు ఈ రోజు భీమవరంలో నన్ను కలిసి విజ్ఞాపన అందచేశారు. నాలుగు ప్రశ్నలపై అభ్యంతరాలు చెబుతూ ప్రామాణిక పుస్తకాలను కూడా ఆధారాలుగా చూపించినా పరిగణించడం లేదని ఆవేదన చెందారు. ఆలాగే ఈ.డబ్ల్యూ.ఎస్. రిజర్వేషన్ అంశాన్నీ నా దృష్టికి తీసుకువచ్చారు. పోటీ పరీక్షల్లో ప్రతి ఒక్క మార్కు ఎంతో విలువైనది. తమ జీవితాలను ఆ ఒక్క మార్కు మారుస్తుందని తెలంగాణ నుంచి వచ్చిన ఆ యువకులు ఆందోళనతో చెప్పారు. వీరి అభ్యంతరాలను, ఆవేదనను సానుకూల దృక్పథంతో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి, రాష్ట్ర మంత్రి శ్రీ కె.టి.ఆర్.గారికి విజ్ఞప్తి చేస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.