మేనిఫెస్టోలో టాలీవుడ్కు హామీలు.. కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపిన తారాగణం
ఈ నెల 22న (ఆదివారం ) సీఎం కేసీఆర్ను పలువురు సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా తెలుగు సినీ పరిశ్రమ ఎంతగానో నష్టపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు సీఎంను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. తెలుగు చిత్ర పరిశ్రమకు పలు హామీలు ఇచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో ఇచ్చిన హామీల మేరకు నష్టపోయిన తెలుగు చిత్రసీమకు సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా అధికార తెరాస మేనిఫెస్టోలో టాలీవుడ్కు కూడా స్థానం కల్పించారు. అందులో ముఖ్యంగా..
రూ.10కోట్ల లోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ అందించడం.
థియేటర్ల యాజమాన్యం రోజూవారి ప్రదర్శనల సంఖ్య పెంచుకునేందుకు వీలు కల్పించడం.
సినిమా టికెట్ ధరలో సవరణలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం.
థియేటర్లకు కనీస విద్యుత్తు ఛార్జీలను కూడా రద్దు చేస్తామని తెరాస ప్రకటించింది.
వీటితో పాటు థియేటర్లను ఎప్పుడైనా తెరుచుకోవచ్చన్నారు. ఆ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు సినీ పరిశ్రమకు పూర్తి అధికారం ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని సినీపెద్దలు వ్యూహాత్మకంగా ఆలోచించాలని సీఎం అన్నారు.
ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి మద్దతుగా నిలిచిన కేసీఆర్కు అగ్ర కథానాయకులు చిరంజీవ, నాగార్జున, వెంకటేశ్, రామ్చరణ్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతినిధులు కూడా ధన్యవాదాలు తెలుపుతూ.. కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేశారు.