గోవధ బిల్లు ఆమోదంతో ప్రజల్లో సంతోషం

గోవధ నిరోదక బిల్లు ఆమోదంతో రాష్ట్రంలోని 90శాతం మంది ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కర్ణాటక సీఎం బీఎస్‌ యడ్యూరప్ప అన్నారు. బుధవారం అసెంబ్లీలో గోవధ నిషేధం, పశు సంరక్షణ బిల్లులు ఆమోదం పొందిన సందర్భంగా శుక్రవారం బెంగళూర్‌లో ఆయన గోపూజ చేసి మాట్లాడారు. భారత సంస్కృతిలో ఆవుకు విలువైన సంపదగా గుర్తింపు ఉందని అన్నారు. గోవుల సంరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

ఇదిలాఉండగా బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీలో చర్చించకుండానే ప్రభుత్వం బిల్లును ఆమోదించిందని ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌, జేడీ(యూ)లు ఈ బిల్లు ఆమోదంపై మండిపడుతున్నాయి.. నూతన చట్టం ప్రకారం ఆరోగ్యవంతమైన గోవును వధించిన వారికి 3 నుంచి ఏడు సంవత్సరాలు జైలుశిక్షతోపాటు 5 నుంచి 10 లక్షల జరిమానా విధించవచ్చు. 13 ఏండ్ల పైబడిన గేదె లేదా దున్నను వధించేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. పశువుల అక్రమ అమ్మకాలు, రవాణా నేరం. గోవుకు జబ్బు చేసి దాని నుంచి వ్యాధి ఇతర పశువులకు సోకే అవకాశం ఉంటే దాన్ని వధించేందుకు అవకాశం ఉంటుందని ఆ రాష్ట్ర మంత్రి జేసీ మధుస్వామి తెలిపారు.