సంఘీభావం తెలియచేసిన ప్రజా నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు

విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఎటువంటి అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తోందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఈ చర్యలను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలియచేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేయడాన్ని తప్పుబట్టి, పార్టీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులను ఖండించినందుకు కృతజ్ఞతలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు ఫోన్లో సంభాషించారు. ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు. జనసేన పార్టీ నాయకుల అరెస్టులను ఖండించారు. మద్దతుగా నిలిచిన శ్రీ సోము వీర్రాజు గారికి, బిజెపీ జాతీయ కార్యదర్శులు శ్రీ సునీల్ దేవధర్ గారికి, శ్రీ సత్య కుమార్ గారికి ధన్యవాదాలు. ఎమ్మెల్సీ శ్రీ మాధవ్ గారు కలిసి సంఘీభావం తెలియచేశారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా చేసిన అతి పోకడలను ఖండించినందుకు వారికి నా కృతజ్ఞతలు. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు డా.జయప్రకాష్ నారాయణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను ఖండించారు. వారికి ధన్యవాదాలు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు విశాఖలో చోటు చేసుకున్న ఘటనను, ప్రభుత్వ ధోరణిని తప్పుబట్టినందుకు కృతజ్ఞతలు. ఈ చర్యలను ఖండించి ప్రజాస్వామ్య విధానాలను సమర్థించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. జనసేన పార్టీ నాయకులు విశాఖలో ప్రభుత్వ పెడ ధోరణులను నిరసిస్తూ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలను ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టారు. పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్తున్న పార్టీ నేతలు, వీర మహిళలు, జన సైనికులకు అభినందనలు అని శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు.