తెలంగాణ ఇంటర్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు మార్గం సుగమం అయింది. తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే ఇంటర్ సెకండియర్ లో ప్రవేశించిన విద్యార్థులకు ఫస్టియర్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహించడం తగదని తల్లిదండ్రుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు… ఈ నెల 25 నుంచి పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఈ పరిస్థితుల్లో పరీక్షలు అడ్డుకోలేమని స్పష్టం చేసింది. పిటిషనర్లు ఈ దశలో కోర్టుకు రావడం సరికాదని తెలిపింది. విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని, చివరి నిమిషంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం వివరించింది. కోర్టు నిర్ణయం నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం తమ పిటిషన్ ను ఉపసంహరించుకుంది.