జీవో 1 లాంటివి ఉంటే శ్రీ జగన్ రెడ్డి పాదయాత్ర చేసేవారా?

ప్రతిపక్ష పార్టీల గొంతు వినిపించకూడదు… ఆ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించకూడదు అనే ఉద్దేశంతోనే జీవో 1ని తీసుకువచ్చారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. ఇటువంటి జీవో గతంలో ఉండి ఉంటే శ్రీ జగన్ రెడ్డి గారు నాడు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేయగలిగేవారా? ప్రజా వ్యతిరేక విధానాలను పాలకులు అమలు చేస్తుంటే ప్రజా పక్షం వహించడం ప్రతిపక్ష పార్టీలుగా మా బాధ్యత. ఇలాంటి చీకటి ఉత్త్వరులు ఇవ్వకుండానే అందులోని దురుద్దేశాలను విశాఖ నగరంలో అక్టోబరులోనే వెల్లడించారు. వాహనంలో నుంచి కనిపించకూడదు, ప్రజలకు అభివాదం చేయకూడదు అని, హోటల్ నుంచి బయటకు రాకూడదు అని నిర్బంధాలు విధించారు. ఇప్పటం వెళ్లరాదని అటకాయించారు. ఆ పెడ పోకడలనే అక్షరాల్లో ఉంచి జీవో ఇచ్చారు. ఈ ఉత్తర్వుల బూచి చూపి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కుప్పం పర్యటన చేయకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాను. ఈ విధమైన చర్యలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయి. శ్రీ చంద్రబాబు గారు ఎమ్మెల్యేగా తన నియోజక వర్గంలో పర్యటించి ప్రజలను కలవడం ఆయన విధి. ఆయన విధులను జీవో 1 ద్వారా అడ్డుకొంటున్నారా? ఈ ఉత్తర్వులు శ్రీ జగన్ రెడ్డి గారికి వర్తిస్తాయా? లేవా? నిన్నటి రోజున రాజమహేంద్రవరంలో జనాన్ని రోడ్డుకు ఇరువైపులా నిలబెట్టి ఆయన చేసిన షో ఈ ఉత్తర్వుల ఉల్లంఘన పరిధిలోకి వస్తాయో రావో పోలీసు ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాలి. చీకటి జీవోలతో రాష్ట్రంలో క్రమంగా నియంతృత్వం తీసుకువస్తున్న పాలకుల విధానాలను ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించాలి అని పవన్ కళ్యాణ్ కోరారు.