జనసేన ప్రభుత్వంలో సంక్షేమంతోపాటు అభివృద్దికీ పెద్దపీట

• వైసీపీ సంక్షేమ విధానంతో ప్రజలకు మేలు జరగలేదు
• జె బ్రాండ్ మద్యంతోపాటు గంజాయి అమ్మకాలు తీసుకువచ్చారు
• భవన నిర్మాణ కార్మికులు ఇప్పటికీ బోరుమంటున్నారు
• ఇసుక ఇప్పటికీ సామాన్యుడికి అందని ద్రాక్షగానే ఉంది
• జనసేన ప్రభుత్వంలో పేదలు ఇళ్లు కట్టుకునేందుకు ఉచిత ఇసుక
• ప్రజలు జనసేన పార్టీని నమ్ముతున్నారు
• ప్రతి కార్యకర్త శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
• మచిలీపట్నం ఆవిర్భావ సభ విజయవంతానికి కృషి చేయాలి
• మచిలీపట్నంలో కృష్ణా జిల్లా పార్టీ సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

జనసేన ప్రభుత్వంలో సంక్షేమంతోపాటు అభివృద్ధికీ పెద్ద పీట వేస్తుందనీ, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. వైసీపీ సంక్షేమమనే ఏకైక విధానంతో ముందుకు వెళ్తోందని, ఈ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో ఏ వర్గానికీ మేలు జరిగింది లేదన్నారు. జనసేన పార్టీ ప్రభుత్వంలోనే మార్పు సాధ్యమన్న విషయాన్ని ప్రతి కార్యకర్త గడప గడపకు తీసుకువెళ్లాలని పిలుపు నిచ్చారు. కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే బాధ్యత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని.. ఆ ధైర్యాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను జనసైనికులు, వీర మహిళలు తీసుకోవాలని సూచించారు. జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ నేపథ్యంలో బుధవారం రాత్రి కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యకర్తలు, నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. ఆవిర్భావ సభ ఏర్పాట్లపై దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “14వ తేదీన మచిలీపట్నం వేదికగా జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ జరుగుతోంది. ఇక్కడ సభ నిర్వహించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పటం లాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా స్థల పరిశీలన, ఎంపిక తదితర అంశాల మీద కొంత గోప్యత పాటించాల్సి వచ్చింది. ప్రభుత్వ దాష్టికాలకు బెదరకుండా ఇక్కడ రైతాంగం నిండు మనసుతో 34 ఎకరాల భూమి సభ కోసం ఇచ్చారు. ఇప్పుడు మరో 60 ఎకరాలు కూడా రైతులు ఇచ్చారు. ఓటమి భయంతో ప్రభుత్వం రెచ్చిపోయి ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తున్నా మచిలీపట్నం రైతాంగం ధైర్యంగా, ఆదర్శవంతంగా నిలబడ్డారు. రైతాంగానికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి, నియోజకవర్గాల నుంచి వచ్చే వారికి ఘనంగా స్వాగతం పలుకుదాం. మహిళలతో పాటు అందరికీ సౌకర్యాలు అందేలా చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది.
• జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరిగింది
జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా సమాజానికి మేలు జరిగే విధంగా ముందుకు వెళ్తోంది. పోరాట యాత్ర ప్రారంభించినప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అకౌంట్లో రూ. 7 లక్షలు మిగిలితే అంబేద్కర్ భవన్ లాంటి చోట బస చేసి యాత్ర ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేశారు. కొంత మంది పార్టీని ఉపయోగించుకుని వెళ్లిపోయారు. చాలా మంది నిబద్దతతో ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు పార్టీని నిజంగా మోసింది జనసైనికులు, వీర మహిళలే. అదే స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగింది. ప్రజలు మనల్ని నమ్ముతున్నారు. మనం చేసే ప్రతి కార్యక్రమం తమ బిడ్డల భవిష్యత్తు కోసమేనన్న విషయాన్ని గుర్తించారు.
• బందరు పోర్టుకు ఎన్ని సార్లు శంకుస్థాపనలు చేస్తారు?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు కేసుల భయంతో ఆలోచించినా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదే స్టీల్ ప్లాంట్లో సభ ఏర్పాటు చేసి స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు. ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు అని చెప్పారు. జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా పరిశ్రమలు రావాలని, తద్వారా పెట్టుబడులు రావాలని ఆకాంక్షతో ముందుకు వెళ్లింది. బందరు పోర్టుకు 1977లో మా తండ్రి గారు మంత్రిగా ఉన్న సమయంలో మొట్ట మొదటి శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు కదిలింది లేదు. ఈ ముఖ్యమంత్రి బటన్లు నొక్కుతున్నానని చెప్పుకుంటూ పాలన సాగిస్తున్నాడు. క్షేత్ర స్థాయిలో ప్రజల ఇబ్బందుల మీద వాస్తవాలు తెలుసుకోవడం లేదు.
• ఇప్పటికీ ఇసుక లేదు
జగ్గయ్యపేట ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికులు కలిసి ఇప్పటికీ పనులు లేవని చెప్పారు. కారణం ఇసుక కొరత. ఇసుక పాలనీ ద్వారా ప్రభుత్వానికి రూ. 3 వేల కోట్లు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. రూ. 3 వేల కోట్లు ప్రభుత్వానికి ఇచ్చి రూ. 30 వేల కోట్లు వారి జేబుల్లో వేసుకుంటున్నారు.. 20 టన్నులు చెప్పి 30 టన్నులకు పైగా దోచుకుపోతున్నారు. ఇసుక సామాన్య ప్రజలకు చేరకుండా చేసేశారు. జనసేన ప్రభుత్వం రాగానే పేదలు ఇళ్లు కట్టుకునేందుకు ఇసుక ఉచితంగా అందచేస్తుంది. పాదయాత్రలో ముద్దులు పెట్టుకుంటూ తిరిగిన ఈ ముఖ్యమంత్రి అన్ని వర్గాలను మోసం చేశాడు. జాబ్ క్యాలెండర్ రాలేదు. కాంట్రాక్టు ఉద్యోగస్తుల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పి మోసం చేశాడు. అప్పుడు ఇంటింటికీ ముద్దులు పెట్టుకుంటూ రోడ్ల వెంట తిరిగాడు. ఇప్పుడు 20 కిలోమీటర్లు కూడా రోడ్డు మార్గంలో ప్రయాణం చేయడం లేదు. ఇలాంటి పరిస్థితులు మారాలి.
• ప్రెస్ మీట్లు పెట్టడమే స్థానిక ఎమ్మెల్యే అజెండా
ఇక్కడ మచిలీపట్నం ప్రజాప్రతినిధి చూస్తే ఎక్కువ సమయం ప్రెస్ మీట్లకే కేటాయిస్తారు. ఆయన ముందున్నది ఒకటే అజెండా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ పెడతారు.. ఎక్కడికి వెళ్తున్నారు.. ఏం చేస్తున్నారో తెలుసుకుని ప్రెస్ మీట్లు పెట్టడం ఆయన్ని అభాసుపాలు చేసే ప్రయత్నం చేయడం. మచిలీపట్నం నియోజకవర్గంలో చూస్తే ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలా లేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్ల ఆయనకు ఆనందం వస్తుందో లేక వాళ్ల నాయకుడికి ఆనందం వస్తుందో తెలియదు గాని అదే పనిలో ఉంటారు. మచిలీపట్నం డంపింగ్ యార్డు సమస్య ఏళ్ల తరబడి అలాగే ఉంది. కాలువలు బాగు చేయరు, వైద్యసదుపాయాల గురించి ప్రజలు వేడుకుంటున్నా పట్టించుకోరు. ఇక్కడ ఉన్న ప్రతి సమస్య గురించి ఆవిర్భావ సభ వేదికగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారు.
• రైతు భరోసా కేంద్రాలు అతిపెద్ద దళారీ కేంద్రాలు
నివర్ తుఫాను వచ్చినప్పుడు రైతుల పక్షాన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిలబడితే ఈ ప్రభుత్వం చేతులెత్తేసింది. రైతు భరోసా కేంద్రాలు పెడుతున్నాం. ప్రతి గింజా కొంటామన్న ముఖ్యమంత్రి ఏమయ్యాడో తెలియదు. రైతు భరోసా కేంద్రాలు మాత్రం అతిపెద్ద దళారీ కేంద్రాలుగా మారిపోయాయి. ఈ ప్రభుత్వ పాలనలో ఒక్క రైతూ సంతోషంగా లేడు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఈ ముఖ్యమంత్రి వచ్చాక ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారే అండగా నిలిచారు. గత ఉగాది రోజున నిర్ణయం తీసుకుని తన సొంత సంపాదన నుంచి రూ. 5 కోట్లు కేటాయించారు. కృష్ణా జిల్లాలోనూ 51 మంది ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆవిర్భావ సభ వేదిక మీద వారికి ప్రత్యేక స్థానం కల్పించి ప్రతి కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం చేయబోతున్నాం. దేశంలో ఇలాంటి కార్యక్రమం ఏ నాయకుడు చేయలేదు. ఇన్ని వ్యాపారాలు ఇంత సంపాదన ఉన్న ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు చేశారా…ఇచ్చిన హామీలు విస్మరించి రాష్ట్రంలో విచ్చలవిడిగా జె బ్రాండ్ మద్యం అమ్ముకుంటున్నాడు. జె బ్రాండ్లు కొనడానికి జనం భయపడుతున్నారని ఇప్పుడు రాష్ట్రం మొత్తం గంజాయి పాకించేశారు. కాలేజీలకు తీసుకువచ్చి అమ్ముతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్న పరిస్థితి. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. శాంతి భద్రతలు లేవు. అందుకే మరోసారి ఇటువంటి నాయకుల్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ ద్వారా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్ధేశం చేస్తారు. ఏ రాజకీయ పార్టీ చరిత్రలో ఇలాంటి సభ జరగని విధంగా విజయవంతం చేద్దాం. మన సభకు గ్రామ గ్రామానికి వెళ్లి ప్రజల్ని ఆహ్వానించాలని అన్నారు.
• జనసేన పార్టీలోకి వైసీపీ నేత
మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేత శ్రీ వికృతి శ్రీనివాస్ (కొరియర్ శ్రీను) బుధవారం శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు మాజీ కార్పోరేటర్లు, సుమారు 500 మంది అనుచరులు జనసేన కండువా కప్పుకున్నారు. అందరికీ శ్రీ మనోహర్ గారు సాదర స్వాగతం పలికారు. క్రమశిక్షణతో పార్టీని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
• డీఎస్సీ శిక్షణార్ధుల వినతిపత్రం
గత నాలుగు సంవత్సరాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ లేక కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న పలువురు డీఎస్సీ శిక్షణార్ధులు శ్రీ మనోహర్ గారికి వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఆవిర్భావ సభ వేదికగా అన్ని సమస్యల మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మచిలీపట్నం ఇంఛార్జ్ శ్రీ బండి రామకృష్ణ, కార్యక్రమాల నిర్వహణ విభాగం ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ పోతిన మహేష్, పార్టీ నాయకులు శ్రీ అమ్మిశెట్టి వాసు, శ్రీ అక్కల గాంధీ, శ్రీ తాడిశెట్టి నరేష్, శ్రీ బూరగడ్డ శ్రీకాంత్, శ్రీ మండలి రాజేష్, శ్రీ యడ్లపల్లి రామ్ సుధీర్, శ్రీ బొలియాశెట్టి శ్రీకాంత్, శ్రీ మత్తి వెంకటేశ్వరరావు, శ్రీ వంపుగడల చౌదరి తదితరులు పాల్గొన్నారు.