న భూతో… అనేలా మచిలీపట్నం ఆవిర్భావ సభ

* కౌలు రైతుల కుటుంబాలకు సభ సాక్షిగా సాయం
* రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా సభ
* 34 ఎకరాలకు తోడు మరో 60 ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులకు అభినందనలు
* మచిలీపట్నంలో విలేకరుల సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

మచిలీపట్నలో ఈ నెల 14వ తేదీన నిర్వహించబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు ఒక దిశా నిర్దేశం చూపేలా ఉంటుంది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించనున్నారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ స్థలాన్ని ఆయన బుధవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఆవిర్భావ సభ జరగనుంది. ఇప్పటికే సభ నిర్వహించుకునేందుకు 34 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. దానికి అదనంగా మరో 60 ఎకరాల భూమినీ సభ అవసరాల నిమిత్తం ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం అనందంగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయబోతున్నాం. లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నాం. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొచ్చేందుకు ఈ సభ ఒక పునాది కానుంది. జనసేన రాజకీయ పోరాటం మీద అధ్యక్షుల వారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. అలాగే రాష్ట్ర ప్రజల భవిత, రాష్ట్ర గతి మెరుగుపడాలంటే ఏం చేయాలో కూడా ఆయన చెబుతారు.
* కౌలు రైతు కుటుంబాలకు సాయం… వాలంటీర్లకు ప్రత్యేక గౌరవం
పార్టీ ఆవిర్భావ సభలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం జరగనుంది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాకు అందిన సమాచారం మేరకు 51 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు సమాచారం ఉంది. ఇప్పటికే మా బృందం క్షేత్రస్థాయిలో కౌలు రైతుల కుటుంబాలను కలుస్తోంది. వారికి తగిన సహాయం అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఇటీవల పార్టీ చేపట్టిన మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదులో బాగా పని చేసిన వాలంటీర్లకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. వారికీ సభ వద్ద ప్రత్యేక వీఐపీ పాసులు ఇచ్చి వారిని తగిన విధంగా గౌరవించుకుంటాం. 25 సభ్యత్వాలు కంటే ఎక్కువ చేపించిన 6 వేల మంది వాలంటీర్లకు ఈ ప్రత్యేక గౌరవం ఇస్తాం. దీంతోపాటు ఐటీ, సోషల్ మీడియాలో పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వారికీ తగిన గుర్తింపు కచ్చితంగా ఉంటుంది. సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పోలీసుల సూచనలు పాటించి ముందుకు సాగుతున్నాం. పోలీసులు సైతం అడ్డంకులు పెట్టకుండా పార్టీ శ్రేణులకు సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
* ప్రత్యేక కమిటీలు
పార్టీ సభ స్థలం జాతీయ రహదారికి పక్కనే ఉంది. రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. ముఖ్యంగా సభ నిర్వహణ కోసం నియోజకవర్గానికి ఇద్దరూ చొప్పున సమన్వయకర్తలను వేస్తున్నాం. వారికి అదనంగా మరో సంయుక్త సమన్వయకర్త ఉంటారు. అలాగే వివిధ విభాగాల పర్యవేక్షణ నిమిత్తం కమిటీలు వేసుకుని చక్కగా కార్యక్రమం నిర్వహించేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి” అన్నారు. సమావేశంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ అద్యక్షుడు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం ఇంచార్జి శ్రీ బండి రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ అక్కల గాంధీ, రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిసెట్టి వాసు, కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
* రోడ్డు మార్గం… సభాస్థలి వరకు పరిశీలన
మచిలీపట్నం సభాస్థలి పరిశీలనకు బుధవారం సాయంత్రం మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విజయవాడ నుంచి మచిలీపట్నం సభాస్థలి వరకూ ఉన్న మార్గాన్ని పరిశీలించారు. 14వ తేదీన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి మచిలీపట్నం సభ వేదికకు వారాహి వాహనంతో రానుండటంతో ఏ ప్రాంతాల్లో తగిన విధంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అనే విషయాలు పరిశీలించారు. భారీగా జనం వచ్చే అవకాశం ఉండటంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని, ఆహారం, మజ్జిగ, మంచినీళ్ళు అందించడం, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు ఉండాలని చెప్పారు. మజ్జిగ, తాగునీరు జాతీయ రహదారి వెంబడి ఉండేలా చూడాలని చెప్పారు. అనంతరం సభాస్థలి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ నేతలు శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, శ్రీ పోతిన మహేష్, శ్రీ అమ్మిసెట్టి వాసు, శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ బండి రామకృష్ణ, శ్రీ మండలి రాజేష్, శ్రీ బూరగడ్డ శ్రీకాంత్, శ్రీ తాడిసెట్టి నరేష్, శ్రీ యడ్లపల్లి రామ్ సుధీర్ తదితరులతో కలసి పరిశీలించారు. దేనికి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.